నిర్మల్ టౌన్, డిసెంబర్ 16 : మార్కెట్లో క్రిస్మస్ సందడి మొదలైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించుకునేందుకు క్రైస్తవులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను అందజేస్తున్నది. ఈ నెల 25న క్రిస్మస్ పండుగ ఉన్నందున క్రైస్తవులకు రాష్ట్ర ప్రభుత్వం కానుకలు (కొత్త బట్టలు) పంపించింది. ఇవి ఇప్పటికే జిల్లాకు చేరాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలుండగా.. నియోజకవర్గానికి వెయ్యి చొప్పున క్రిస్మస్ కానుకలను ప్రభుత్వం ఆయా జిల్లా కేంద్రాలకు పంపింది. వీటిని స్థానిక ఫాస్టర్ల సహకారంతో జిల్లా కేంద్రం నుంచి ఆయా నియోజకవర్గాలకు మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా సరఫరా చేస్తున్నారు.
నేటి నుంచి పంపిణీకి చర్యలు..
జిల్లా మైనార్టీశాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను ప్రభు త్వం అందజేస్తున్నది. ఒక్కొక్క క్రిస్మస్ కిట్లో చీర, సల్వార్ షర్ట్, ప్యాంటు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి ఈ నెల 23వ తేదీ వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, ఖానాపూర్, బోథ్, ముథోల్, ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లో పంపిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. నిర్మల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి క్రిస్మస్ కానుకల పంపిణీని ప్రారంభించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వ విప్, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో కానుకలను అందించనున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రాలకు క్రిస్మస్ కానుకలు చేరుకోగా.. వాటిని ఆయా నియోజకవర్గాల్లో క్రైస్తవులున్న గ్రామాలను గుర్తించి పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశాం..
క్రిస్మస్ పండుగ నేపథ్యంలో క్రైస్తవులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు కానుకలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశాం. ఒక్కొక్క నియోజకవర్గానికి వెయ్యి చొప్పున కానుకలు పంపనున్నాం. ఇప్పటికే జిల్లా కేంద్రానికి ఈ కిట్లు చేరుకున్నాయి. వాటిని ఫాస్టర్ల ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సరఫరా చేసి పంచేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆయా గ్రామాల్లో పంపిణీకి సైతం ఏర్పాట్లు పూర్తిచేశాం.