మామడ, నవంబర్ 29 : జిల్లాలో ఆయిల్ పామ్ను సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తున్నది. ఈ పంట సాగు ఇక్కడి ప్రాంతం రైతులకు కొత్తది కావడంతో ప్రాముఖ్యతను ఉద్యానవన, వ్యవ సాయ శాఖ అధికారులు రైతులకు వివరిస్తు న్నారు. ఇతర జిల్లాలో సాగు చేస్తున్న ఆయిల్ పామ్ క్షేత్రాలకు ఇక్కడి రైతులకు తీసుకెళ్లి అవగాహన కల్పిస్తున్నారు.
2వేల ఎకరాల్లో సాగు..
వివిధ గ్రామాల రైతులు ఆయిల్పామ్ సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు. జిల్లాలో 10వేల ఎకరాల్లో పంట సాగు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. దాదాపు 900 మంది రైతులు 5వేల ఎకరాలలో సాగు చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. 2 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలను నాటడం పూర్తి అయింది. ఇంకా 2వేల ఎకరాల్లో మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధ్దం చేశారు. ఒక మొక్కకు రూ.193 కాగా 90 శాతం సబ్సిడీతో రైతుకు రూ.20లకే అందిస్తున్నారు. ఒక ఎకరం లో 50 మొక్కలు నాటుతారు. ఇందుకు గానూ మొక్కలకు రూ.9650 వ్యయం అవుతుంది. ప్రభుత్వ రాయితీ రూ.8650పోగా రైతు 50 మొక్కలకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఆర్మూర్ సమీపంలోని చేపూర్ నర్సరీ నుంచి మొక్కలు అధికారులు తరలిస్తున్నారు. జిల్లాలోని రైతులు ఇటీవల ఖమ్మం జిల్లాలో సాగులో ఉన్న ఆయిల్ఫామ్ తోటలను ఉద్యావనశాఖ ఆధ్వర్యం లో పరిశీలించారు. సోన్ మండలంలోని పాక్పట్ల సమీపంలో ఆయిల్పామ్ పరిశ్రమకు అనువైన స్థలాన్ని అధికారులు గుర్తించారు.
బిందు సేద్యంతో సాగు..
ఆయిల్ఫామ్ సాగు చేసే రైతులకు ఎకరానికి 90శాతం సబ్సిడితో బిందుసేద్యం పరికరాలను అందిస్తారు. ఒక ఎకరానికి బిందుసేద్యం పరిక రాల యూనిట్ ధర రూ.19,057 కాగా రాయితీ గా రూ.17,150 పోగా రైతు వాటా రూ. 1907 జీఎసీ రూ.3,334 కలిసి రూ.5,241 రైతు చెల్లించాల్సి ఉంటుందని ఉద్యానవనశాఖ అధికా రులు తెలిపారు. మొక్కలు నాటిన తర్వాత నాలుగేళ్ల అనంతరం దిగుబడులు ప్రారంభమ వుతాయి. ప్రారంభంలో ఎకరానికి 7 నుంచి టన్నులు దిగుబడులు వస్తాయి. ప్రస్తుతం మార్కె ట్లో ఒక టన్ను ఆయిల్ పామ్ ధర రూ.22,765 పలుకుతున్నది. ఎకరానికి రూ.1,60,000 చేతికందుతుంది.
అంతర పంటలకు అనుకూలం
ఆయిల్పాం సాగుకు ఇతర పంటలతో పోల్చితే ఈ సాగుకు పెట్టుబడి తక్కువే. రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట వేసుకోవాలని రైతులను ప్రోత్సహి స్తున్నది. ఈ పంటకు తేలిక పాటి నేలలు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. ఇందులో పొద్దు తిరుగుడు, పత్తి, సోయా, పసుపు మక్కజొన్న, మిరప, నువ్వు, మినుము, పెసర, జొన్న, కూర గాయల తోటలను సైతం అంతర పంటగా వేసుకునే అవకాశముంది.
పది ఎకరాల్లో సాగు చేస్తున్న..
పది ఎకరాల్లో ఆయిల్ పాం పంటను సాగు చేస్తున్న. మక్కజొన్న, సోయా పంట సాగు చేస్తుండడంతో అధికారులు అవగా హన కల్పిస్తున్నారు. ఎలాంటి ఒడిదొడుకులు లేని పంట అని తెలుసుకున్నాకే సాగు మొగ్గు చూపా.ప్రభుత్వం సాగును ప్రోత్సహిస్తోంది.
– పాట్కూరి గంగారెడ్డి, రైతు (కొరిటికల్)
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయిల్పాం సాగుకు శ్రీకారం చుట్టాం.వివిధ కేటగిరీల రైతులకు రాయితీపై డ్రిప్ పరికరాలు అంద జేస్తున్నాం.ఈ పంటకు 30 సంవత్సరాల వరకు ఇబ్బంది లేదు. నెలనెలా ఆదాయం పొందవచ్చు.
సృజిత, ఏఈవో(మామడ క్లస్టర్)