నిర్మల్ అర్బన్, నవంబర్ 28 : ఆహ్లాదం.. ఆధ్యాత్మిక కేంద్రం.. అభినవ షిర్డీగా గండిరామన్న దత్త సాయి ఆలయం విరాజిల్లుతున్నది. వందలాది మంది భక్తులు నిర్మల్ కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి బాబాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. సాయిబాబా, దత్తసాయి ఆలయం, దూని, ధ్యాన మందిరం, భారీ శివుడి విగ్రహం, అన్నం కలిపే సాయిబాబా విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ఆలయం ఎదురుగా దాదాపు 16 అడుగులతో కూడిన దక్షణముఖ హన్మాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీని ఎదురుగా సాయి అఖండ నందదీప్ను ఏర్పాటు చేశారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ లక్కాడి జగన్మోహన్ రెడ్డి సొంత ఖర్చుతో తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం లక్షల నిధులతో వీటిని చేపట్టారు. గండిరామన్న దత్తసాయి ఆలయంలో ఈ నెల 30వ తేదీ నుంచి సాయి పారాయణ వేడుకలు నిర్వహించనున్నారు. షిర్డీ నుంచి 9వ సారి సాయి పాదుకలు, సాయి పల్లకీ తీసుకొచ్చి ఆలయంలో ఈ నెల 6వ తేదీ వరకు సాయి పారాయణం నిర్వహించనున్నారు.
ఇవీ పూజా కార్యక్రమాలు..
డిసెంబర్ 5వ తేదీ సోమవారం నుంచి బుధవారం వరకు దత్తాత్రేయ జయంతి నిర్వహించనున్నారు. సోమవారం జిల్లాలోని భజన మండలి భక్తులతో 48 గంటల గొప్ప అఖండ సాయినామం ప్రారంభిస్తారు. మంగళవారం ఉదయం సాయిబాబాకు మంగళస్నానం, అర్చన పూజ, ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని ప్రధాన వీదుల గుండా సాయి పల్లకీ ఊరేగింపు, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. బుధవారం ముగింపు వేడుకల్లో భాగంగా దత్తాత్రేయుడు, సాయిబాబాకు మంగళస్నానం, పాలాభిషేకం, అర్చనలు, హారతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం సాయి హారతి, మహాన్నదానం నిర్వహించనున్నారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ లక్కాడి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వేడుకలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరుకానున్నారు. భక్తులకు ఎలాం టి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు బారికేడ్లను, డైనింగ్, వాహన పార్కింగ్, తదితర ఏర్పాట్లు పూర్తి చేశారు.
పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావాలి
దత్తసాయి ఆలయంలో బుధవారం నుంచి నిర్వహించే సాయిపారాయణం, దత్త జయంతికి వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్, డైనింగ్, బారికేడ్లను ఏర్పాటు చేశాం. జిల్లాలోని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వేడుకలను జయప్రదం చేయండి.
– ఆలయ ట్రస్ట్ చైర్మన్ లక్కాడి జగన్మోహన్ రెడ్డి