నిర్మల్, నవంబర్ 21(నమస్తే తెలంగాణ) : జిల్లాలో వరి, మక్కజొన్న, పత్తి పంటలకు ప్ర త్యామ్నాయంగా ఆయిల్పామ్ పంటను సా గు చేసే దిశగా రైతులకు అవసరమైన రాయితీలను అందజేస్తూ ప్రోత్సహిస్తున్నది. జిల్లావ్యాప్తంగా 10 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ మొ క్కలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా రు. అయితే యేటా సాగు లక్ష్యాన్ని మరింత పెంచి, రానున్న రోజుల్లో పంట ఉత్పత్తుల ద్వారా రైతులు అధిక ఆదాయాన్ని పొందేలా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ మేరకు ఉద్యానవన శాఖ ఆయిల్పామ్ సాగుకు సంబంధించిన లక్ష్యాన్ని, ప్రణాళికను రూపొందించి ఇప్పటికే సర్కారుకు నివేదించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ సాగయ్యే ఆయిల్పామ్ గింజలను నూనెగా తయారు చేసేందుకు ఓ పరిశ్రమను ఏర్పాటు చేయాలని తలపెట్టారు. దీనికోసం మలేషియా దేశానికి చెం దిన ప్రీ యూనిక్ కంపెనీతో పరిశ్రమ ఏర్పా టు కోసం ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమయ్యే 60 ఎకరాల స్థలాన్ని సోన్ మండలంలోని పాక్పట్ల గ్రామ శివారులో సేకరించారు. కాగా సారంగాపూర్ మండలం బీరవెల్లిలో ఇప్పటికే ఆయిల్పామ్ మొక్కల నర్సరీలో 10 వేల ఎకరాలకు సరిపడా మొక్కలను అందుబాటులో ఉంచారు.
గతేడాది ఉద్యానవన, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు సంయుక్తంగా ఆయిల్పామ్ పంట సాగుపై రైతులకు అవగాహన పెంపొందించే ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సైతం సాగు చేయాలని పిలుపునివ్వడమే కా కుండా స్వయంగా తన వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్పామ్ మొక్కలను నాటించారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 648 మంది రైతులు ముందుకు వచ్చి 2100 ఎకరాల్లో ఆయిల్పామ్ మొక్క లు నాటారు. వచ్చే మార్చి చివరి నాటికి మరో 6 వేల ఎకరాల్లో సాగు చేయించాలని ఆయా శాఖల అధికారు లు లక్ష్యంగా పెట్టుకున్నారు. సాగు నీటి వనరులు పుష్కలంగా ఉండి, డ్రిప్ ఇరిగేషన్ లాంటి సౌకర్యాలు ఉన్న రైతులకు మొదట ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఆయిల్పామ్ ఉత్పత్తులను ఎగుమతి చేయాలంటే రైతులకు రవాణా వ్యయం భారంగా మారే అవకాశం ఉన్నది. దీంతో పాటు పొరుగున ఉన్న నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో కూడా ఆయిల్పామ్ సాగు లక్ష్యాన్ని ఉధృతం చేస్తున్న కారణంగా గింజల నుంచి ఆయిల్ను తీసే పరిశ్రమ ఏర్పాటు అవసరమున్నదని గుర్తించారు. ఇందులో భాగంగానే పాక్పట్ల గ్రామంలో పరిశ్రమ ఏర్పాటుకు అన్ని రకాల చర్యలు మొదలైనట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయిల్పామ్ పంటను సాగు చేయాలని భావిస్తున్న రైతులకు మరింత ఊతమిచ్చినట్లవుతోందంటున్నారు.
రూ.400కోట్లతో పరిశ్రమ..
జిల్లాలో ఆయిల్పామ్ పరిశ్రమ ఏర్పాటురే దాదాపు అన్ని రకాల చర్యలు పూర్తయ్యాయి. మలేషియా దేశానికి చెందిన ప్రీ యూనిక్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకొన్న ఒప్పందంలో భాగంగానే సోన్ మండలం పాక్పట్ల గ్రామ శివారులో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. నిర్మల్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని మరో 7 జిల్లాల్లో ఈ కం పెనీ ఆధ్వర్యంలోనే ఆయిల్పామ్ నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను రైతులకు పంపిణీ చేస్తున్నారు. కాగా పరిశ్రమ ఏర్పాటుకు అవసరమయ్యే దాదాపు రూ.400 కోట్లను ప్రీ యూనిక్ కంపెనీయే భరించనున్నది. అయితే పరిశ్రమ ఏర్పాటుకు అవసరమయ్యే స్థలాన్ని మాత్రం ప్రభుత్వమే సమకూర్చనున్నది. ఇప్పటికే పాక్పట్ల గ్రామ శివారులో 60 ఎకరాల స్థలాన్ని సేకరించి అనుమతుల కోసం సర్కారుకు నివేదించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ఆ స్థలాన్ని సదరు పరిశ్రమ యాజమాన్యానికి అప్పగించనున్నారు.
ఇదిలాఉంటే ఇక్కడ ఏర్పాటు చేయనున్న పరిశ్రమలో ఎంతవరకు మిల్లింగ్ సాధ్యమవుతుందోననే అంశాలపైనా కసరత్తు జరుగుతున్నది. సాంకేతికపరమైన అనుకూలతలు, క్షేత్రస్థాయిలోని పరిస్థితులు, ఆయిల్పామ్ దిగుబడులు, బహిరంగ మార్కెట్ ధరలు, ప్రభుత్వ ప్రో త్సాహం లాంటి అంశాలన్నీ పరిశ్రమ అభివృద్ధికి, ఆయిల్పామ్ సాగు పురోగాభివృద్ధికి దో హదం చేస్తాయంటున్నారు. ఇదిలాఉంటే సోన్ మండలం పాక్పట్ల గ్రామ శివారులో ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ఏర్పాటుకు అవసరమైన 60 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. అక్కడి నుంచి అనుమతులు రాగానే పరిశ్రమ ఏర్పాటు పనులు మొదలవుతాయి.