నిర్మల్, సెప్టెంబర్ 5(నమస్తే తెలంగాణ) : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మడిపెల్లి భద్రయ్య, సాహితీ రంగానికి చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్లోని శాస్త్రీ నగర్ చౌరస్తాలో సోమవారం ఏర్పాటు చేసిన మడిపెల్లి భద్రయ్య విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన మడిపెల్లి భద్రయ్య, సాహితీ చరిత్రలో కూడా సువర్ణాక్షరాలతో లిఖించ దగ్గ మహనీయుడని కొనియాడారు. భద్రయ్యతో తనకు మూడు దశాబ్దాలకు పైగా సాన్నిహిత్యం ఉందని గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చరిత్రను పాట రూపంలో తెలుగు ప్రజలకు పరిచయం చేసిన గొప్ప కవి అని పేర్కొన్నారు. రాష్ట్రపతి పురస్కారం పొందిన మడిపెల్లి భద్రయ్య కాంస్య విగ్రహాన్ని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. గోదావరి పరీవాహక ప్రాంతం కవులు, కళాకారులు, సంస్కృతి, నాగరికత వైభవానికి చిహ్నంగా నిలిచిందని పేర్కొన్నారు. అందులో భాగంగానే చెన్నూరు ప్రాంతంలో అప్పట్లోనే ప్రముఖ విద్వాంసులు వానమామలై వరదాచార్యులు, ఆదిలాబాద్ నుంచి సామల సదాశివ, నిర్మల్ నుంచి మడిపెల్లి భద్రయ్య సాహితీమూర్తులుగా జన్మించారని కొనియాడారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యమ పిలుపును అందుకున్న భద్రయ్య.. వృద్ధాప్యాన్ని లెక్కచేయకుండా ఎంతో చురుగ్గా పాల్గొంటూ చాలా మంది కవులు, కళాకారులకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. అలాంటి మహనీయుడు మన మధ్య లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు. భద్రయ్య జ్ఞాపకాలను భావితరాలకు తెలియజేసేందుకే నిర్మల్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆయన సేవలను నిర్మల్ ప్రజలు, ఉపాధ్యాయ లోకం ఎన్నటికీ మరువదన్నారు. రాబోయే రోజుల్లో మడిపెల్లి భద్రయ్య జయంతి, వర్ధంతిని ఘనంగా నిర్వహించుకుందామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ కే విజయలక్ష్మీరాంకిషన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ప్రముఖ కవులు కృష్ణంరాజు, పత్తి శివప్రసాద్, పట్వర్ధన్, నేరెళ్ల హన్మంతు, పోలీస్ భీమేశ్, సీ సంతోష్కుమార్, వెంకట్, బీ పురుషోత్తంతో పాటు భద్రయ్య కుటుంబ సభ్యులు మడిపెల్లి దక్షిణామూర్తి, రాజశేఖర్, హరిహరనాథ్, సాయినాథ్, విజయ్కుమార్, కవులు, కళాకారులు, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.