ఎదులాపురం, ఏప్రిల్ 24: జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్న డయాగ్నోస్టిక్ సెంటర్, హర్షస్కిన్ జనరల్ దవాఖానపై శనివారం తనిఖీ బృందం సభ్యులు దాడులు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్టెస్ట్లు ఎలా చేస్తున్నారని నిర్వాహకులను ప్రశ్నించారు. హర్షస్కిన్ జనరల్ దవాఖానలో 125 ర్యాపిడ్టెస్ట్ కిట్లు లభించాయని తెలిపారు. పరీక్షల కోసం వచ్చే వారి వద్ద నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. థైరోకేర్లో కొన్ని ఆర్టీపీసీఆర్ కిట్లు ఉండడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లో మూసివేయాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని బృందం సభ్యుడు అశోక్ తెలిపారు. థైరోకేర్ డయాగ్నోస్టిక్ సెంటర్, హర్షస్కిన్ జనరల్ దవాఖానకు నోటీసులు జారీ చేశారు. తనిఖీ బృందం సభ్యులు ఆడె మహేందర్, శ్రీకాంత్ ఉన్నారు.