కరోనా నేపథ్యంలో పాతతరం ఆహారపు అలవాట్లపై ప్రజల ఆసక్తి
ఫాస్ట్ఫుడ్ను వదిలి.. ఇంటి భోజనంపై మక్కువ
చిరు ధాన్యాలకే అత్యంత ప్రాధాన్యం
పుష్కలంగా విటమిన్లు
సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం
ఇచ్చోడ, ఏప్రిల్ 23 : కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరణంలో ప్రజలు ఫాస్ట్ఫుడ్ను వదిలి.. ఇంటి భోజనంపై ఆసక్తి చూపుతున్నారు. పాత తరం ఆహారపు అలవాట్లపై మక్కువ చూపుతున్నారు. పుష్కలంగా విటమిన్లు లభించే చిరు ధాన్యాలకే ప్రాధాన్యమిస్తున్నారు. ఇది వరకు పిల్లలు పాఠశాల నుంచి ఇంటికి రాగానే మార్కెట్లో దొరికే స్నాక్స్, సమోసాలు, నూడిల్స్వంటివి ఇచ్చేవారు. వారు కూడా అలాంటి ఫుడ్కే బాగా అలవాటు పడిపోయారు. ప్రస్తుతం కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో చాలా మంది ఇంటి ఫుడ్కే ప్రాధాన్యమిస్తున్నారు. చిరు ధాన్యాలతో తయారు చేసిన వంటకాలను పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటున్నారు. ఫలితంగా స్థూలకాయం, అధిక బరువు, షుగర్, గుండె జబ్బులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు నొప్పి వంటివి దరి చేరకుండా చూసుకుంటున్నారు. ఏదేమైనా మన పాత తరం ఆహారపు అలవాట్ల వైపు మొగ్గు చూపడమే మేలని ఎంతో మంది సూచిస్తున్నారు.
ప్రయోజనాలు..
చిరు ధాన్యాలైన రాగులు, సజ్జలు, కొర్రలులాంటివి తీసుకోవడం వల్లే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో పిండి పదార్థంతో పాటు ప్రొటీన్లు, పీచు పదార్థం, ఇనుము, కాల్షియం, జింకువంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వీటితో చేసిన ఆహారం బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. కడుపులో అల్సర్లవంటి సమస్యలు ఉండవు. జీర్ణక్రియ బాగుంటుంది.
రాగులు చేసే మేలు…
మనిషికి హిమోగ్లోబిన్ 15 మిల్లీ గ్రాములుంటే.. వ్యాధి నిరోధక శక్తి బాగుంటుందని వైద్యులు సూచిస్తున్నారు. అన్నింటికన్నా రాగులు శరీరానికి అవసరమైన పోషక పదార్థాలతో పాటు ఎముకలకు కావాల్సినంత కాల్షియాన్ని అందిస్తాయి. రాగులకు బెల్లం జత చేసిన ఆహార పదార్థాలు ఇప్పుడు ఇళ్లలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలకు వీటిల్లో ఉండే ఇనుప ధాతువు వల్ల రక్తహీనత సమస్య ఏర్పడదు. దీంతో పాటు జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలు, అరికలతో వంటలను మెనూలో చేర్చారు.
బెల్లంతో కలిపి తినుబండరాలు
చిరు ధాన్యాలు, బెల్లం కలిపి చేసిన తినుబండరాలను ఇప్పుడు ఎక్కువగా తింటున్నారు. ముఖ్యంగా నూనె తక్కువగా ఉండే వాటినే భుజిస్తున్నారు. బెల్లం పాకంతో వేరు శనగ ఉండలు, నువ్వుల ఉండలు, ఉడికించిన దుంపలు, వేరు శనగలు, కొబ్బరి, బెల్లం రాగులతో లడ్డు, అటుకుల లడ్డు, మినుప లడ్డువంటివి ఇళ్లలోనే చేసుకుంటున్నారు.
ఫాస్ట్పుడ్కు స్వస్తి
ఫాస్ట్ పుడ్లో నూనె శాతం అధికంగా ఉంటుంది. చాలా కాలం నిల్వ ఉంచిన పిజ్జాలు, బర్గర్లు, ఇతర వంటకాలను ప్రజలు ఎక్కువగా తినేవారు. ఇవి ఆరోగ్యానికి హాని చేసేవి. ప్రస్తుతం కరోనా దెబ్బకు జనం బయట తినడం మానేసి.. ఎంచక్కా ఇంటి వంటకాలను ఆస్వాదిస్తున్నారు.
పుష్కలంగా పోషకాలు
ఫాస్ట్పుడ్ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. కానీ ఆరోగ్యానికి చాలా నష్టం జరుగు తుంది. వాటిని ఎక్కు వగా ఉడికిస్తారు. కాబట్టి పోషకాలు అంతగా ఉండవు. చిరు ధాన్యాల్లో బీ-కాంప్లెక్స్ ఫైబర్ అధికంగా ఉంటాయి. వాటితో తయారు చేసిన పదార్థాలతో శరీరానికి మంచి పోషకాలు లభిస్తాయి. మనకు అందుబాటులో ఉండే చౌక పదార్థాలతోనే వాటిని తయారు చేసుకోవచ్చు. పైగా వీటితో శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.
హిమాబిందు, ప్రభుత్వ వైద్యాధికారి, నర్సాపూర్
ఆహారపు అలవాట్లు ముఖ్యం
కరోనాకు ముందు ఫాస్ట్పుడ్ కల్చర్ అధికంగా ఉండేది. దీంతో గ్యాస్ట్రిన్ సమస్యలు ఎక్కువగా వచ్చేవి. శరీరంలో అనవసర ఆమ్లాలు చేరడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటుంది. ముఖ్యంగా కొవ్వు పదార్థాల వల్ల ఉబకాయంవంటి సమస్యలు తప్పవు. గతంలోకంటే ఇప్పుడు సాధారణ జబ్బులు తగ్గాయంటే.. దానికి మారిన ఆహారపు అలవాట్లు, వ్యాయామమే కారణం.
ఆకుదారి సాగర్, ప్రభుత్వ వైద్యుడు, ఇచ్చోడ