ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. నిర్మల్ నియోజకవర్గంలో ఆ పార్టీ అంచనాలను తలకిందులు చేస్తూ భారీగా టీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతుంది. కొందరు కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఇది ఇబ్బందికరంగా మారింది.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి వీడ్కోలు పలికి గులాబీ దళంలో చేరే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మొన్నటికి మొన్న నర్సాపూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కారెక్కారు. ఇక తాజాగా నిర్మల్ పట్టణం మార్కెట్ ఏరియా 27 & 39వ వార్డుల కాంగ్రెస్ కౌన్సిలర్లు అయేషా, రవూఫ్, 5వ వార్డు కౌన్సిలర్ గుంజల లక్ష్మి చైతన్యతో పాటు సుమారు 600 మంది కార్యకర్తలు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
శాస్త్రి నగర్ క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు మారుగొండ రాము, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, మున్సిపల్ విప్ నేరెళ్ళ వేణు, పార్టీ సీనియర్ నాయకులు కోటగిరి ఆశోక్ , కౌన్సిలర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు.