నిర్మల్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ): అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం నిర్మల్ జిల్లాలో జోరుగా సాగుతున్నది. రెండో విడుత చేపట్టిన ఈ కార్యక్రమం వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఈ విడుతలో ఇప్పటి వరకు 12 రోజుల పాటు పరీక్షలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 32 వైద్య బృందాలు ఈ క్యాంపుల్లో పాల్గొంటున్నాయి. 12 రోజులుగా 43,458మందికి కంటి పరీక్షలు చేశారు. 8055 మందికి రీడింగ్ అద్దాలు అందించారు. మరో 7664 మంది కి దృష్టి లోపం ఉండడంతో సైట్ అద్దాలను రెఫర్ చేశారు. వీరికి త్వరలోనే అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు శిబిరాలు నిర్వహించే ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కంటి వెలుగు శిబిరాలకు తొలి రోజు నుంచే విశేష స్పందన వస్తున్నది. ప్రజలు ఉత్సాహంగా శిబిరాలకు పరీక్షలు చేయించుకుంటుండడంతో ఆయా కేంద్రా లు జనంతో సందడిగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేసి కళ్లద్దాలు పంపిణీ చేస్తుండడంపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. వంద రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయాలనే లక్ష్యంతో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు కార్యాచరణ రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను సంబంధిత శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సందర్శిస్తూ వైద్య బృందాలకు సూచనలు ఇస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులను సమన్వయంతో అధికారులు కంటివెలుగు శిబిరాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
ఉదయం నుంచే బారులు…
జిల్లా వ్యాప్తంగా మూడు నియోజకవర్గాల పరిధిలో 32 కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో 6, నిర్మల్ నియోజకవర్గంలో 13, ముథోల్ నియోజకవర్గంలో13 వైద్య బృందాలు వారంలో 5 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ కంటి పరీక్షలు చేస్తున్నాయి. పరీక్షల కోసం ఉదయమే ఆయా కేం ద్రాలకు చేరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా శిబిరా ల వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉచితంగా కం టి పరీక్షలు చేసి, అవసరమైన వారికి అప్పటికప్పుడే అద్దా లు పంపిణీ చేస్తుండడంతో ప్రజల నుంచి స్పందన వస్తున్నది. కొన్ని చోట్ల పరీక్షల కోసం బారులు తీరుతున్నారు.
స్పందన వస్తున్నది :జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి ధన్రాజ్
జిల్లాలో నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరాలకు ప్రజల నుంచి స్పందన వస్తున్నది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో శిబిరం ప్రారంభానికి ముందే ప్రజలు బారులు తీరుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. అవసరమైన చోట ప్రత్యేకంగా టెంట్లు వేయిస్తు న్నాం. శుద్ధ జలం అందిస్తున్నాం.