బాసర : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో గురువారం నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైయ్యాయి. తొలి రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం 4 గంటలకు ఆలయ అర్చకులు, వేద పండితులు అమ్మవారిని అభిషేకం నిర్వహించి, ఆలయ చైర్మన్ శరత్పాఠక్ , ఈవో వినోద్రెడ్డిలు కలశం స్థాపన పూజ చేసిన అనంతరం ఘట స్థాపన పూజలు నిర్వహించారు.
ఆలయంలో గణపతి పూజ, కలశ పూజ, చతుషష్టి పూజ, తదితర వాటిని నిర్వహించారు. అనంతరం భక్తులు భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు. శైలపుత్రి అమ్మవారిని గురువారం ఆలయ అర్చకులు నైవేద్యంగా కట్టె పొంగలి సమర్పించారు. అర్చకులు చిన్నారులకు అక్షరఅభ్యాసాలను జరిపించారు. ఆలయంలో కోవిడ్ కారణంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. సరస్వతి అమ్మవారు రెండవ రోజు శుక్రవారం బ్రహ్మచారిణి అవతారంలో దర్శనం ఇవ్వనున్నారు. అమ్మవారికి నైవేద్యంగా పులిహోరను సమర్పించనున్నారు.