కుభీర్, నవంబర్ 28 : రాష్ట్రం ఏర్పాటు తర్వాత పురాతన ఆలయాల పునర్నిర్మాణం, నూతన ఆలయాల నిర్మాణం, కల్యాణ మండపాల నిర్మాణాలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తూ హిందువుల మనోభావాల పరిరక్షణకు కృషి చేస్తున్నారని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. మండలంలోని హంపోలి, కస్రా గ్రామాల్లో రూ.45 లక్షలతో కల్యాణ మండపం, హనుమాన్ మందిర పునర్నిర్మాణానికి సోమవారం ఆయన భూమిపూజ చేశారు. దైవం, ధర్మం మేమే అని చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్న కొన్ని పార్టీలు కేంద్రంలోని సర్కారు సహాయంతో ఎక్కడా ఒక్క ఆలయానికి నిధులు తెచ్చిన దాఖలాలు లేవని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని మతాలు, కులాలను సమాన దృష్టితో చూస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యేను ప్రజలు ఘనంగా సత్కరించారు. సర్పంచ్ నర్సారెడ్డి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు దత్తుగౌడ్, తూం రాజేశ్వర్, రేకుల గంగాచరణ్, మల్లారెడ్డి, దత్తహరి పటేల్, దిగంబర్ పటేల్, డాక్టర్ రాజన్న పాల్గొన్నారు.
ప్రొసీడింగ్ కాపీ అందజేత
భైంసాటౌన్, నవంబర్ 28 : మండలంలోని చుచుంద్ సిద్ధేశ్వర ఆలయ ప్రాంగణంలో కల్యాణ మండపం నిర్మాణానికి రూ. 20 లక్షలు మంజూరైనట్లు ముథోల్ ఎమ్మెల్యే జీ విఠల్ రెడ్డి తెలిపారు. ప్రొసీడింగ్ కాపీని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తన స్వగృహంలో గ్రామస్తులకు సోమవారం అందజేశారు. ఈ సందరభంగా గ్రామస్తులు ప్రభుత్వానికి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు మేరాజ్ తదితరులు పాల్గొన్నారు.