నిర్మల్ అర్బన్, డిసెంబర్ 21: జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించి, నేరస్తులకు శిక్షపడేలా చూడాలని నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ అన్నారు. నిర్మల్లోని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. కోర్టు విధులు నిర్వహించే పోలీస్ అధికారులు సమర్థవంతంగా పని చేసి నేరస్తులు శిక్ష పడేలా చూడాలన్నారు. నేరాల నియంత్రణ, కేసుల పురోగతికి దోహదం చేసే సీసీ కెమెరాల ఆవశ్యకతను వివరిస్తూ, ప్రతి వ్యాపార, వాణిజ్య సముదాయాలలో వాటిని ఏర్పాటు చేసుకునేలా చూడాలని సూచించారు. ఆపద సమయంలో వినియోగించే డయల్ 100 కాల్స్పై నిర్లక్ష్యం చూపవద్దని, తక్షణమే ఘటనా స్థలానికి చేరుకోవాలని ఆదేశించారు. పోలీసులు తమ విధుల్లో నిర్లక్ష్యం చూపవద్దన్నారు.
అంకితాభావంతో పని చేయాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. వారి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు. నేరాల నియంత్రణకు పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. ఆయా పోలీస్ స్టేషన్లలో అంకితాభావంతో విధులు నిర్వహించిన పోలీసు అధికారులకు ప్రశంసా పత్రాలను అందించారు. ఈనేర సమీక్షలో భైంసా ఏఎస్పీ కిరణ్ ఖారే, నిర్మల్ డీఎస్పీ జీవన్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రమేశ్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సీఐలు ప్రవీణ్ కుమార్, అజయ్ బాబు, రాంనర్సింహారెడ్డి, వెంకటేశ్, శ్రీనివాస్, చంద్రశేఖర్, వినోద్, జిల్లాలోని ఎస్సైలు, ఐటీ కోర్ సిబ్బంది తదితరులున్నారు
సోన్ సీఐని అభినందించిన ఎస్పీ
సోన్, డిసెంబర్ 21 : సోన్ సీఐ రాంనర్సింహారెడ్డి విధుల్లో ప్రతిభ చూపగా ఎస్పీ ప్రవీణ్కుమార్ తన కార్యాలయంలో ఆయనను ప్రత్యేకంగా అభినందించి అవార్డు అందించారు. జిల్లాలో ఉత్తమ సీఐగా రాంనర్సింహారెడ్డి ఎంపిక కావడంతో ప్రశంసాపత్రంతో పాటు జ్ఞాపికను అందించారు. కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ జీవన్రెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు.