నిర్మల్, జూలై 28(నమస్తే తెలంగాణ):మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తోంది. ఇందులో భా గంగా యేటా 100 శాతం సబ్సిడీతో చేప పిల్లల పెంపకం చేపడుతున్నది. ఈ మేరకు 2022-23 సంవత్సరానికిగాను ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాలోని జలాశయాల్లో బొచ్చ, రాహువు, బంగారుతీగ, ముల్లంగి రకాలకు చెందిన చేప పిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆగస్టు మొదటి వారం నుంచి ఈ ప్రక్రియ మొదలు కానున్నది. 16 రిజర్వాయర్లు, 1, 605 చెరువులు ఉన్నాయి. వీటి పరిధిలో 430 మత్స్య పారిశ్రామిక సహకర సంఘాలుండగా, 25,166 మంది సభ్యులు గా కొనసాగుతున్నారు. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో భారీ వర్షాలు పడడంతో ఉమ్మడి జిల్లాలోని అన్ని జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టాలతో కళకళలాడుతున్నాయి. ప్రధాన ప్రాజెక్టులైన శ్రీరాంసాగర్, కడెం, స్వర్ణ వాగు, గడ్డెన్నవాగు, పల్సి రంగారావుకర్ ప్రాజెక్టు, సాత్నాల, కరత్ వాడ, శ్రీపాద ఎల్లంపల్లి, కుమ్రంభీం ప్రాజెక్టు, వట్టివాగు ప్రాజెక్టుల్లో సైతం ఈసారి పెద్ద ఎత్తున చేప పిల్లలను వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రిజర్వాయర్లు, చెరువుల్లో 9.85 కోట్ల చేప పిల్లలను వదిలేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చేప పిల్లల కొనుగోళ్లకు సంబంధించి టెండర్ల ప్రక్రియ సైతం పూర్తవ్వడంతో ఇక చేప పిల్లలను వదలడంపై సంబంధిత శాఖ అధికారులు దృష్టిసారించారు.
ఏడాది పొడవునా ఉపాధి
కులవృత్తులకు ఆసరా కల్పించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఒక్కోటి దిగ్విజయంగా అమలవుతున్నాయి. ఇందులో భాగంగానే మత్స్యకారులను ఆదుకునేందుకు ఈ ఏడాది కూడా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుంది. తద్వారా చేపల ఉత్పత్తులను గణనీయంగా పెంచి, మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపాలని ప్రభుత్వం ఆశిస్తోంది. రూపాయి పెట్టుబడి లేకుండా నీటి పారుదల, గ్రామ పంచాయతీ చెరువుల్లో కోట్లలో చేప పిల్లలను వదలనుంది. కుల వృత్తిని నమ్ముకొని జీవనం సాగించే వారికి రూపాయి పెట్టుబడి లేకుండా ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ పథకం ఎంతో దోహదపడుతోంది. ఒక్కో సభ్యుడికి సీజన్లో సగటున రూ.50 వేలకుపైగానే లబ్ధి కలుగుతోంది. ఈ ఏడాది కూడా ప్రతి సభ్యుడు అదే స్థాయిలో ఆదాయం పొందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాంతానికి చెందిన చేపలు ఇతర రాష్ర్టాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి. దీంతో చేపలను విక్రయించుకునేందుకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించే దిశగానూ మత్స్యశాఖ చర్యలు తీసుకుంటున్నది.
మత్స్యకారులకు ఆర్థిక చేయూత
ఈ ఏడాది చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు పిలిచి ప్రక్రియను పూర్తి చేశాం. ఆగస్టు మొదటి వారం నుంచి ఉచితంగా మత్స్యకార్మికులకు పంపిణీ చేసి విడుతల వారీగా చెరువుల్లో వదులుతాం. అలాగే సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా మత్స్యకార్మికులకు చేపల యూనిట్ నిర్మాణాలు, ఐస్ ప్లాం ట్ల నిర్మాణం, వాహనాలను సబ్సిడీపై అందిస్తున్నాం. చేపలను విక్రయించేందుకు మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తు న్నాం. మహిళా మత్స్యకార సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ సమకూర్చి ఆర్థిక పరిపుష్టికి తోడ్పడేలా చర్యలు చేపడుతున్నాం. మత్స్యకార్మికులు ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం చేయూతనిస్తోంది. ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకుని మత్స్యకార్మికులు ఆర్థికంగా ఎదగాలి.
– నర్సింహారావు, జిల్లా మత్స్యశాఖ అధికారి, నిర్మల్ జిల్లా