మామడ, జూలై 25 : నిర్మల్ జిల్లా మామడ మండలంలోని వాస్తాపూర్ జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నది. దట్టమైన అటవీ ప్రాంతంలో కొండల మధ్య 25అడుగుల ఎత్తు నుంచి జాలువారుతూ పాలధారను మరిపిస్తున్నది. ఈ నేపథ్యంలో స్థానికంగా పర్యాటకుల రద్దీ పెరిగింది. జలపాతాన్ని వీక్షించేందుకు వస్తున్న వివిధ ప్రాంతాలకు చెందిన వారితో సందడి నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో వచ్చి గంటల తరబడి సరదాగా గడుపుతున్నారు.
చేరుకోవడం ఇలా…
జిల్లా కేంద్రం నుంచి ఆదిలాబాద్ వెళ్లే హైవే నుంచి ఇక్కడకు చేరుకోవచ్చు. కొండాపూర్ హైవే, మేడిపెల్లి, బూరుగుపెల్లి, మొండిగుట్ట, తాండ్ర గ్రామాల మీదుగా 20కిలో మీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. దారి పొడవునా ఘాట్రోడ్డులో ప్రకృతి అందాలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి.