నిర్మల్, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లా వైద్య కళాశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15వ తేదీన సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో కళాశాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ వరుణ్రెడ్డి ఇప్పటికే కళాశాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిర్మల్ శివారులోని భీమన్న గుట్ట ప్రాంతంలో నిర్మించిన కాలేజీ భవనం దాదాపుగా పూర్తయి ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. ఇప్పటికే 100 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి అధికారులు కౌన్సెలింగ్ సైతం నిర్వహించారు. శుక్రవారం రెండో కౌన్సెలింగ్ కూడా పూర్తయ్యింది. రాష్ట్ర కోటాలో 85 సీట్లకు గాను 84 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. అలాగే ఆలిండియా కోటాలో మూడో రౌండ్లో 15 సీట్లకు గాను 8 మందిని కేటాయించారు. వీరు ఈ నెల 10వ తేదీ నుంచి 18వ తేదీ లోపు చేరాల్సి ఉంటుంది. కాగా ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతుల నిర్వహణకు ఇప్పటికే 28 మంది బోధనా సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. మొత్తానికి నిర్మల్ మెడికల్ కళాశాలలో ఈ నెల 15 నుంచి తరగతులు ప్రారంభం కానుండడంతో ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేరబోతున్నది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మెడికల్ కాలేజీలో ఔట్సోర్సింగ్ ద్వారా సిబ్బందిని నియమించుకునే ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ ఇప్పటికే ఆదేశించారు.
నిర్మల్ జిల్లా వాసులకు మెడికల్కాలేజీ ఏర్పాటుతో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం మెరుగైన వైద్య చికిత్సల కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు పరుగులు పెట్టాల్సి వస్తున్నది. అలాగే నిర్మల్ మీదుగా వెళ్తున్న జాతీయ రహదారులపై తరచూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్న కారణంగా వారికి అత్యవసర వైద్య చికిత్సలను ఇక్కడ అందించలేని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారు మరణిస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. దీంతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలైన కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ తదితర విభాగాల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం… ఆరోగ్యపరంగానే కాకుండా, ఆర్థిక పరంగా కూడా సమస్యగా మారింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ప్రారంభం కానుండడంతో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కృషితో మెడికల్ కళాశాల రావడంపై ఈ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఆరోగ్యపరంగా పూర్తి భద్రత దక్కబోతుందంటున్నారు.
కౌన్సెలింగ్ ప్రక్రియ దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 15న సీఎం కేసీఆర్ ఆన్లైన్ ద్వారా ఇక్కడి మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారు. అదే రోజు విద్యార్థులకు తరగతులను కూడా ప్రారంభిస్తాం. 28 మంది టీచింగ్ ఫ్యాకల్టీని ప్రభుత్వం నియమించగా, ఇప్పటికే అంతా విధుల్లో చేరారు. విద్యార్థులకు ప్రయోగాల కోసం అవసరమైన అన్ని రకాల సదుపాయాలను అందుబాటులో ఉంచుతున్నాం. ఇక్కడి ప్రభుత్వ ప్రధాన దవాఖాన, మెటర్నిటీ ఆసుపత్రుల్లో ప్రాక్టికల్స్ తరగతులను కొనసాగిస్తాం.
-జడ్.వీ.ఎస్.ప్రసాద్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్
జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ప్రారంభం కానుండడంతో స్థానికులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం అంటే న్యూరాలజీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ, ఆంకాలజీ తదితర విభాగాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే నిర్మల్లో 350కి పైగా పడకలు అందుబాటులోకి వచ్చాయి. కళాశాల భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయడం వల్ల వైద్య విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. మెడికల్ కాలేజీ కోసం కృషి చేసిన మంత్రులు ఇంక్రరణ్రెడ్డి,హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
-డాక్టర్ ఏ.దేవేందర్రెడ్డి, సూపరింటెండెంట్