నిర్మల్ జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 99 శాతం ఉత్తీర్ణత సాధించి నంబర్ వన్గా నిలిచారు. ఆదిలాబాద్ జిల్లా 19, మంచిర్యాల జిల్లా 23, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా 30వ స్థానం సాధించాయి. ఇంటర్మీడియట్ తరహాలోనే టెన్త్ ఫలితాల్లో కూడా బాలికల హవా కొనసాగింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బాలుర కంటే బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా మంచి ఫలితాలు సాధించారు. చాలా మంది విద్యార్థులకు 10 జీపీఏలు వచ్చాయి. కాగా.. నిర్మల్ కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్, డీఈవో, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. కలెక్టర్, డీఈవోను మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అభినందించారు. చదువుల తల్లి సరస్వతీ దేవి కొలువుదీరిన నిర్మల్ను రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలవడం సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
నిర్మల్ అర్బన్, మే 10 : పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా విద్యార్థులు 99 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. జిల్లావ్యాప్తంగా 9,071 మందికి 8,980(99 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 4,442 మంది బాలురకు 4,392 మంది, 4,629 మంది బాలికలకు 4,588 మంది పాస్ అయ్యారు. టెన్త్తో పాటు ఇంట ర్ ఫలితాల్లోనూ నిర్మల్ జిల్లా బాలికలు అధికంగా ఉత్తీర్ణత సాధించారు.
కేజీబీవీల్లోనూ 98.99 శాతం ఉత్తీర్ణత
కేజీబీవీ పాఠశాల విద్యార్థులు కూడా అత్యుత్తమ ప్రతిభ కనబర్చాయి. 18 కేజీబీవీ పాఠశాలలకు చెందిన 690 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా.. 683(98.99 శాతం) మంది ఉత్తీర్ణులు అయ్యారు. ఇందులో 18 పాఠశాలల్లో 14 బడులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. తొమ్మిది మంది 10 జీపీఏ సాధించారు. అత్యధికంగా సోన్ కేజీబీవీ నుంచి ఆరుగురు, దస్తురాబాద్, దిలావర్పూర్, పెంబి నుంచి ఒక్కొక్కరు జీపీఏ సాధించారు. అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. గతేడాది నిర్మల్ జిల్లా ద్వితీయ స్థానంలో నిలువగా.. మొదటి స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఆది నుంచి ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగాలని సూచించారు. అధికార యంత్రాంగం కూడా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్లి లక్ష్యాన్ని చేరుకున్నారు. నిర్మల్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేసిన కలెక్టర్ వరుణ్రెడ్డి, డీఈవో డాక్టర్ రవీందర్రెడ్డిలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అభినందించారు.
డీఈవో, ఉపాధ్యాయ బృందానికి సన్మానం
జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రవీందర్రెడ్డితోపాటు వారి బృందానికి బుధవారం టీఎస్ యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘ సభ్యులు సన్మానించారు. వీరితోపాటు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా సత్కరించారు.
గురుకులాల్లో..
ఉట్నూర్, మే 10 : పది ఫలితాల్లో ఐటీడీఏ పరిధిలోని గిరిజన గురుకులాల విద్యార్థుల హవా కొనసాగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ బాయ్స్, ఇచ్చోడ గర్ల్స్, ఇంద్రవెల్లి గర్ల్స్, ముథోల్ గర్ల్స్ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించిట్లు ఆర్సీవో గంగాధర్ పేర్కొన్నారు. అలాగే ఆదిలాబాద్ బాయ్స్లో 76 మందికి 70(90 శాతం), ఉట్నూర్ బాయ్స్లో 72 మందికి 70(97 శాతం), ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి పీవీటీజీ బాయ్స్లో 52 మందికి 29(55 శాతం), ఆసిఫాబాద్ గర్ల్స్లో 79 మందికి 60(75 శాతం), సిర్పూర్-టీలో 76 మందికి 64(84 శాతం), తిర్యాణిలో 70 మందికి 66(94 శాతం), జైనూర్ గర్ల్స్లో 61 మందికి 47(77 శాతం), బుగ్గారంలో 70 మందికి 56(80 శాతం) మొత్తంగా ఉమ్మడి జిల్లాలోని 12 పాఠశాలల్లో 882 మందికి 788(89 శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.
తవక్కల్ విద్యార్థుల ప్రభంజనం
రామకృష్ణాపూర్, మార్చి 10: 2022-2023 విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో స్థానిక తవక్కల్ ఉన్నత (ఇం.మీ) పాఠశాల విద్యార్థులు 9.8 జీపీఏ సాధించి సత్తా చాటారు. పాఠశాల నుంచి 91 మంది పరీక్షలకు హాజరు కాగా, ఇందులో 46 మంది బాలురు, 45 మంది బాలికలు ఉన్నారు. ఇందులో 89 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పట్టణంలో 98 శాతం ఉత్తీర్ణత సాధించిన ఏకైక పాఠశాల తవక్కల్. వీరిలో రాంపెల్లి శ్రావ్య, పంచిక శివాని, కంబాల జశ్వంత్ లు 9.8 జీపీఏ సాధించి పట్టణంలోనే మొదటి స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులకు తవక్కల్ విద్యా సంస్థల చైర్మన్ అబ్దుల్ అజీజ్ శుభాకాంక్షలు తెలిపారు.
కలెక్టర్ కార్యాలయంలో కేక్ కటింగ్
నిర్మల్ టౌన్, మే 10 : నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఈవో రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు సంబురాలు చేసుకున్నారు. కలెక్టర్ వరుణ్రెడ్డి కేక్ కట్ చేసి మంచి ఫలితాలు సాధించిన డీఈవోతోపాటు ఉపాధ్యాయ సంఘాలను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి స్వీట్లు పంచిపెట్టారు. గతేడాది రెండో స్థానంలో నిలిచిన జిల్లాను ఈ యేడాది మొదటి స్థానంలో నిలపడం వెనుక విద్యాశాఖ అధికారుల సమష్టి కృషి ఉందని ప్రశంసలు కురిపించారు.
డీఈవో, కలెక్టర్కు అభినందనల వెల్లువ
మంచి ఫలితాలు తీసుకొచ్చేందుకు కృషి చేసిన కలెక్టర్ వరుణ్రెడ్డితోపాటు డీఈవో రవీందర్రెడ్డికి కలెక్టర్ కార్యాలయంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు, ప్రైవేటు స్కూల్ యజమాన్యాలు, కేజీబీవీ పాఠశాలల ఎస్వోలు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పుష్పగుచ్ఛం అందించి ప్రత్యేక అభినందనలు తెలిపారు. నిర్మల్ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇదే స్ఫూర్తితో ముందుకెళ్దామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో లోకేశ్, డీఎస్పీ జీవన్రెడ్డి, కస్తూర్బా జిల్లా కో-ఆర్డినేటర్ శ్రీదేవి, పరీక్షల నిర్వహణాధికారి పద్మ, నిర్మల్ ఎంఈవో శంకర్, సోఫినగర్ గురుకుల ప్రిన్సిపల్ గంగశంకర్ ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘ నాయకులు గజేందర్, నాగభూషణం, పీఆర్టీయూ సంఘ నాయకులు నరేంద్రబాబుతోపాటు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
79 మందికి 10 జీపీఏ
మంచిర్యాల అర్బన్, మే 10 : పదో తరగతి పరీక్షల ఫలితాల్లో బాలికలే టాప్లో నిలిచారు. బుధవారం వెలువడిన టెన్త్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మంచిర్యాల జిల్లా 84.87 (బాలురు 82.91, బాలికలు 87) శాతంతో 23వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 10,076 మంది పరీక్షలకు హాజరవగా ఇందులో 5230 మంది బాలురు, 4846 మంది బాలికలు ఉన్నారు. ఇందులో 8552 మంది ఉత్తీర్ణత సాధించగా, 4336 మంది బాలురు, 4216 మంది బాలికలు ఉన్నారు. ఇంటర్తో పాటు పదో తరగతి ఫలితాల్లోనూ బాలికలే సత్తా చాటారు.
247 స్కూళ్లలో 79 మందికి 10 జీపీఏ
మంచిర్యాల జిల్లాలో 247 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ఏహెచ్ఎస్-14, ఎయిడెడ్-4, ప్రభు త్వ -7, కేజీబీవీ-18, ఎల్బీ-99, ఎంజేపీ-7, ప్రైవే ట్-80, టీఎంఆర్ఎస్-3, టీఎస్ఎంఎస్ – 5, టీఎస్ఆర్ఎస్-1, టీఎస్డబ్ల్యూఆర్ఎస్-9) పాఠశాల లు ఉన్నాయి. వీటిలో 10,076 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాశారు. ఇందులో 79 మంది 10 జీపీఏ సాధించారు. ఇందులో లోకల్ బాడీస్ నుంచి 1, ఎంజేపీల నుంచి 5, టీఎంఆర్ఎస్ నుంచి 1, మోడల్ స్కూల్ నుంచి 1, టీఎస్ఆర్ఎస్ నుంచి 1, టీఎస్డబ్ల్యూఆర్ఎస్ నుంచి 3, ప్రైవేటు పాఠశాలల నుంచి 67 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు.
‘ప్రభుత్వ’ పాఠశాలల హవా
ఆసిఫాబాద్ టౌన్, మే 10: పది ఫలితాల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. ఈ ఫలితాల్లో బాలికలే ముందంజలో నిలిచారు. కాగా, జిల్లా 76.36 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో 30వ స్థానం దక్కించుకుంది. జిల్లాలో మొత్తం 6628 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, ఇందులో 3047 మంది బాలురు, 3581 మంది బాలికలు ఉన్నారు. ఇందులో 2215 మంది బాలురు, 2846 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. బాలురు 72.69 శాతం, బాలికలు 79.48 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఫలితాల్లో ‘ఆదర్శ’ంజిల్లా టాపర్గా నిలిచిన అదీబా తహేరిమ్
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల విద్యార్థులు పది ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపారు. 90 శాతం ఉత్తీర్ణత సాధించారు. అత్యధికంగా 9.8 జీపీఏ సాధించిన అదీబా తహేరిమ్ను పాఠశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ కలీల్, ఉపాధ్యాయులు అభినందించారు. మొత్తం 100 మంది పరీక్షలకు హాజరు కాగా, 90 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో చాపిడి హరిణి 9.5, శైలజ 9.3, అమూల్య 9.2 జీపీఏ సాధించి టాపర్లుగా నిలిచారు .
రెండు కేజీబీవీల్లో ‘వంద’
జిల్లాలో రెండు కేజీబీవీలు 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఇన్చార్జి డీఈవో ఉదయ్ బాబు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 150 మందికి పైగా విద్యార్థులు 9 ఆపై జీపీఏ సాధించినట్లు చెప్పారు. తిర్యాణి కేజీబీవీ నుంచి తొమ్మిది మంది పరీక్ష రాయగా, అందరూ ఉత్తీర్ణులయ్యారు. లింగాపూర్ కేజీబీవీ నుంచి 23 మంది పరీక్ష రాయగా, అందరూ పాసైనట్లు తెలిపారు.
అల్ఫోర్స్ ప్రభంజనం 106 మందికి 10 జీపీఏ
కమాన్చౌరస్తా, మే 10: కరీంనగర్లోని అల్ఫోర్స్ విద్యాసంస్థలు పదో తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించాయి. బుధవారం వెలువడిన ఫలితాలల్లో 106 మంది 10 జీపీఏ సాధించి, మరోసారి జిల్లాలో టాప్లో నిలిచారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు విద్యార్థులను కొత్తపల్లి పాఠశాల ప్రాంగణంలో అభినందించి మాట్లాడారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ సూల్లో పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల కృషితో ఇంతటి ఘన విజయం సాధ్యమైందని తెలిపారు. విద్యార్థులకు అత్యుత్తమ విద్యనందిస్తూ సంచలన విజయాలు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. తమ విద్యార్థులు 106 మంది 10 జీపీఏ సాధించడం గర్వంగా ఉన్నదన్నారు. అలాగే, 96 మంది 9.8 జీపీఏ, 77 మంది విద్యార్థులు 9.7, ఒకరు 9.6, 71 మంది 9.5 జీపీఏ సాధించారని, 463 మంది విద్యార్థులు 9 జీపీఏ సాధించారని తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థులు, పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
విద్యార్థులు, అధికారులను అభినందించిన మంత్రి అల్లోల
రాష్ట్రంలో బుధవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా 99శాతం ఉత్తీర్ణత సాధించి, రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకున్నది. ఉపాధ్యాయుల నిరంతర కృషి, కలెక్టర్ వరుణ్రెడ్డి నిరంతర పర్యవేక్షణతో పాటు మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అందించిన ప్రోత్సాహం వల్లే పది ఫలితాల్లో రాష్ట్రంలోనే నంబర్ వన్గా నిలిచామని డీఈవో ఏ. రవీందర్రెడ్డి తెలిపారు.
హర్షం వ్యక్తం చేసిన మంత్రి అల్లోల..
పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా విద్యార్థులు తిరుగులేని ప్రతిభ కనబరిచి, ఉత్తీర్ణతలో రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని పొందడం పట్ల రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బుదవారం ఒక ప్రకటనలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారి, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని మంత్రి అభినందించారు. చదువుల తల్లి సరస్వతీ దేవి కొలువుదీరిన నిర్మల్ జిల్లాలోని విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలవడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు.
కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రభంజనం
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కాగజ్నగర్లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రభంజనం సృష్టించింది. పాఠశాల నుంచి 66 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఒకరు 10జీపీఏ, ఐదుగురు 9.8, ఇద్దరు విద్యార్థులు 9.7, ముగ్గురు 9.5. 18 మంది విద్యార్థులు 9.0 నుంచి 10 లోపు జీపీఏ, 23 మంది విద్యార్థులు 8.0 నుంచి 10.0 లోపు జీపీఏ సాధించినట్లు కరస్పాండెంట్ సురవర్ధన్ తెలిపారు. విద్యార్థులు పట్టుదలతో చదివి, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులు, తదితరులు అభినందించారు, స్వీట్లు పంచారు.
మిమ్స్ వంద శాతం
మంచిర్యాల అర్బన్, మే 10: మంచిర్యాల పట్టణంలోని మిమ్స్ హై స్కూల్ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధిం చినట్లు కరస్పాండెంట్ టీ శ్రీనివాస రాజు బుధ వారం తెలిపారు. 2022-23 విద్యా సంవత్సరంలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా ఐదుగురు 10/10 జీపీఏ సాధించినట్లు చెప్పారు. 10 జీపీఏ సాధించిన బీ హరిణి, టీ హాసిని, సీహెచ్ సంగమిత్ర, ఏ వర్ష, ఎం విష్రు తలను చైర్మన్ ఉపేందర్ రెడ్డి, డైరెక్టర్లు శ్రీధర్రావు, ఎం విజయ్ కుమార్, ప్రిన్సిపాల్ జయశ్రీ దేశ్ముఖ్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.