నిర్మల్ టౌన్, నవంబర్ 18 : నిర్మల్ జిల్లాలో అక్రమ లే అవుట్ల వేస్తే ఉపేక్షించబోమని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ హెచ్చరించారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ నియోజకవర్గాల్లోని ఆయా మండలాల లేఅవుట్ల యజమానులతో , అధికారులతో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. లే అవుట్లకు సంబంధించి డీటీసీపీ పర్మిషన్ కోసం ఆన్లైన్ దరఖాస్తు విధానం పై మరింత అవగాహన పెంచాలన్నారు. 2019 కొత్త మున్సిపాలిటీ చట్టం ప్రకారం జిల్లాలో అక్రమ లేఅవుట్ల నిర్మాణాలను అరికట్టేందుకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిషేధిత భూముల్లో అక్రమ లేఅవుట్లు చేస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. జిల్లా అధికారులు అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి అక్రమ లేఅవుట్లను గుర్తించాలని సూచించారు. అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయడంతో నష్టపోయే ప్రమాదం ఉందని, దీనిపై ప్రజలకు అవగాహన పెంచాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్ సుభాష్చందర్, యజమానులు పాల్గొన్నారు.
ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేయాలి
నిర్మల్ జిల్లాలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అర్హులైన వారి పేర్లు ఓటరు జాబితాలో నమోదు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఓటరు నమోదు రాష్ట్ర పరిశీలకుడు భవాని శంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో స్పెషల్ ఓటరు నమోదు కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే డిసెంబర్ 31 నాటికి 18 యేండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మండలాల్లో ఓటరు జాబితాను బూత్ల వారీగా ప్రకటించినట్లు తెలిపారు. కొత్త ఓటరు నమోదు కోసం ఫాం నం. 6 పూర్తి చేయాలని, మార్పులు, చేర్పులు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. శని, ఆదివారాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని అన్ని పోలింగ్ బూత్లలో నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యాసంస్థలు, ఆయా సంస్థల్లో ఉండే వారు ఓటు నమోదు చేసుకునేలా చూడాలన్నారు. ఆన్లైన్ ఓటరు నమోదుపై కూడా అవగాహన కల్పించా రు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాంబాబు, హేమంత్ బోర్కడే, ఆర్డీవో స్రవంతి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.