రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని విజయవంతంగా అమలు చేస్తుండడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ అవార్డులు వరిస్తున్నాయి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2022 సంవత్సరానికి నీటి వనరుల సంరక్షణ, నిర్వహణ విభాగంలో ఆదిలాబాద్ జిల్లాను జాతీయ నీటి అవార్డుకు ఎంపిక చేసింది. జిల్లా మూడోస్థానం సాధించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ అధికారులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ, చెక్డ్యాంల నిర్మాణం, నీటి కుంటల నిర్మాణం లాంటివి నీటి సంరక్షణ వినియోగానికి ఉపయోగపడ్డాయి. ఫలితంగా నీటి సంరక్షణ, నిర్వహణ మెరుగుపడి జిల్లా అవార్డుకు ఎంపికవడంతో జిల్లావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
– ఆదిలాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ)
ఉమ్మడి రాష్ట్రంలో రైతులు సాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడేవారు. వర్షాలపై ఆధారపడి మాత్రమే సాగు చేసేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగానికి పెద్దపీట వేసింది. ప్రాజెక్టుల నిర్మాణం, మరమ్మతుల నిర్వహణకు భారీగా నిధులు వెచ్చించింది. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల మరమ్మతు, పూడికతీత, కాలువలు, కొత్త చెరువుల నిర్మాణం చేపట్టింది. దీంతో తొమ్మిదేళ్లుగా రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా పోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో యేటా వానకాలం వర్షాలతో సాధారణ వర్షపాతం 1199 మిల్లీ మీటర్లు నమోదవుతున్నది. యేటా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. గతంలో అధిక వర్షపాతం నమోదైనా నీటి నిర్వహణ సరిగా లేక నీరు వృథాగా పోయేది. స్వరాష్ట్రంలో వాననీటిని నిల్వచేసుకునేలా, పారుతున్న నీటిని ఒడిసిపట్టేలా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చెరువులు, చెక్డ్యాంలు, నీటికుంటలు, పర్కులేషన్ ట్యాంకులు, మట్టికట్టలు, ట్రెంచ్ల నిర్మాణాలు చేపట్టింది. ఫలితంగా జిల్లాలో నీటి సంరక్షణ, నిర్వహణ మెరుగుపడింది.
– ఆదిలాబాద్, మే 20(నమస్తే తెలంగాణ)
లక్షల ఎకరాలకు సాగునీరు
ఆదిలాబాద్ జిల్లాలో సాత్నాల, మత్తడి ప్రాజెక్టులతోపాటు 657 చెరువులు ఉన్నాయి. వీటి ద్వారా జిల్లావ్యాప్తంగా 1,15,500 ఎకరాలకు సాగునీరు అందుతోంది. జిల్లాలో 210 చెక్డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం రూ.104.12 కోట్లు ఖర్చు చేసింది. వీటి నిర్మాణం ద్వారా 11,210 ఎకరాలకు సాగునీరు అందుతున్న ఉపాధిహామీలో భాగంగా 101 పాంపౌండ్స్ నిర్మాణానికి రూ.39.42 లక్షలు వెచ్చించగా.. వర్షపు నీటి సంరక్షణకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. చెరువుల్లో పూడికతీత పనులతో కూడా నీటి నిల్వలు పెరిగాయి. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా 349 చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టడంతోపాటు నీరు వృథా పోకుండా కాలువలు, మత్తడి, కట్ట, ఇతర పనులు చేపట్టారు. ఉపాధిహామీ పథకంలో భాగంగా 303 చెరువుల్లో రూ.10.02 కోట్లతో పూడికతీత పనులు చేపట్టారు. చేతిపంపుల వద్ద నీరు వృథాగా పోకుండా 7,256 సోక్పిట్లను నిర్మించారు.
కేంద్ర ప్రభుత్వ అవార్డు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనాన్ని పెంపొందించడంతోపాటు స్థానికులు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతోంది. ఈ కార్యక్రమంతో జిల్లాలోని ముక్రా(కే)తోపాటు ఇతర గ్రామాలు కేంద్ర ప్రభుత్వం అవార్డులు సాధించాయి. జిల్లా సైతం కేంద్ర ప్రభుత్వం అవార్డుకు ఎంపికైంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2022 సంవత్సరానికి నీటి వనరుల సంరక్షణ, నిర్వహణ విభాగంలో ఆదిలాబాద్ జిల్లాను జాతీయ నీటి అవార్డుకు ఎంపిక చేసింది. ఆదిలాబాద్ జిల్లా మూడోస్థానం సాధించినట్లు జలశక్తి మంత్రిత్వశాఖ అధికారులు ప్రకటించారు. అవార్డు రావడంపై వివిధ శాఖల అధికారులను కలెక్టర్ రాహుల్రాజ్ అభినందించారు.