ఆసిఫాబాద్, సెప్టెంబర్ 17 : రాష్ర్టాభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ సుంకరి రాజు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సకు, కలెక్టర్ బొరడే హేమంత్ సహదేవరావు, జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, దాసరి వేణు, ఎస్పీ సురేశ్కుమార్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
మహాత్మాగాంధీ, అంబేదర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ సుంకరి రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో శరవేగంగా దూసుకెళ్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, జడ్పీటీసీలు అరిగెల నాగేశ్వరరావు, కోవ అరుణ, ఎంపీపీలు అరిగెల మల్లిఖార్జున్, విమలాబాయి, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.