కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్హెచ్-363 నాలుగు వరుసల రహదారి పనులు నాసిరకంగా కొనసాగుతున్నాయి. ఈ రహదారి మంచిర్యాల టూ వాంకిడి వరకు దాదాపు 95 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇందులో ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం రెబ్బెన మండలంలోని రేపల్లెవాడ నుంచి వాంకిడి మండలంలోని గోయగాం వరకు దాదాపు 54 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు మూడేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో ఆసిఫాబాద్ నుంచి వాంకిడి వరకు తారు పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇందుకోసం రూ.1,250 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం రెండు మండలాల్లో పనులు పూర్తి కాగా వీయూపీ(వెహికిల్ అండర్ పాసింగ్) పనులు సాగుతున్నాయి. చాలా చోట్ల చిన్నపాటి కాలువలు ఉన్నా కల్వర్టులు నిర్మించ లేదు. పనులు కొనసాగుతుండగానే తారు లేచి పోతున్నది. రాకపోకలు ప్రారంభం కాక ముందే పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. కాగా.. ఎన్హెచ్-363 నిర్మాణానికి మట్టిని రాజూరా గ్రామం మీదుగా రోజూ వందలాది ట్రిప్పుల ద్వారా తరలిస్తుండడంతో రూ.2.44 కోట్లతో వేసిన రోడ్డు గుంతలు పడి ధ్వంసమైంది. మూడేళ్ల క్రితం వేసిన నాలుగు కిలోమీటర్ల రోడ్డులో దాదాపు రెండు కిలోమీటర్ల రోడ్డు ధ్వంసమైంది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఫ్లై ఓవర్ల వద్ద మట్టిని నింపేందుకు గుట్టను మాయం చేస్తున్నారు.
రాష్ట్ర రహదారులు సూపర్
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రహదారుల పనులు వేగంగా కొనసాగుతుండగా.. నాణ్యతగా ఉంటున్నాయి. రహదారులను ప్రజలు, వాహనదారులకు సౌకర్యవంతంగా నిర్మిస్తున్నది. ఆసిఫాబాద్ నుంచి ఉట్నూర్ వరకు ఐదేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం రూ.63 కోట్లతో నిర్మించిన రెండు వరుసల రహదారి (61 కిలోమీటర్లు) చెక్కుచెదర లేదు. అలాగే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి నుంచి జోడేఘాట్ వరకు రూ.15.75 కోట్లతో రెండేండ్ల క్రితం పూర్తి చేసిన రెండు వరుసల రహదారి(23 కిలోమీటర్లు) బాగుంది. ఆర్అండ్బీ శాఖ ద్వారా చేపట్టిన రోడ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి అవుతున్నాయి.
కేంద్ర అటవీశాఖ అడ్డంకితో నిలిచిన రహదారులు
రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రహదారులు చకచకా పూర్తవుతుంటే.. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్లు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి మంజూరైన రోడ్లు కూడా సకాలంలో పూర్తి కాకుండా కేంద్ర అటవీశాఖ అడ్డు పడుతున్నది. అనుమతుల పేరిట కాలయాపన చేస్తున్నది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి పథకం కింద ఆసిఫాబాద్ జిల్లాకు 11 రహదారులకు రూ.40 కోట్లు మంజూరు కాగా.. అటవీ శాఖ అనుమతులు లేక మధ్యంతరంగా నిలిచిపోయాయి. సోమిని నుంచి మురుళిగూడా వరకు రూ.14.54 కోట్లు, పాపన్నపేట్ నుంచి మురళిగూడాకు రూ.21.74 కోట్లు, గుండాయిపేట్ నుంచి వయా జమ్గాం, వోల్తాం, బూరుపల్లి వరకు రూ.22.80 కోట్లు.. చీలపల్లి, రవనపల్లి, మేడిపల్లి, చిన్నమాలిని రహదారులకు రూ.15.42 కోట్లు, కమానా నుంచి సర్కేపల్లి వరకు గల రోడ్డకు రూ.13.32 కోట్లు, మోవాడ్ నుంచి కౌటాన్ మోవాడ్ వరకు రూ.11.60 కోట్లు, బారెగూడ నుంచి బెజ్జూర్ వరకు రూ.16 కోట్లు, దిండా నుంచి ఇత్తం వరకు రూ.4.72 కోట్లు, కమ్మర గాం నుంచి ఖర్జీ, లోహ, కుశ్నపల్లి వరకు రూ.8.80 కోట్లు, మంగి నుంచి దంపూర్ వరకు రూ.25.29 కోట్లు, రాఘనాపూర్ నుంచి గోపెన వరకు రూ.5.24 కోట్ల పనులకు అటవీశాఖ అనుమతులు లేక అసంపూర్తిగా అగిపోయాయి.