మంచిర్యాల నుంచి చంద్రాపూర్ వరకు చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులతో పులులు, ఇతర వన్యప్రాణులకు ఇబ్బందులు కలుగకుండా కేంద్రం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. వాంకిడి-మహారాష్ట్ర సరిహద్దుతో పాటు రెబ్బెన వద్ద రూ. 30 కోట్లతో శరవేగంగా పర్యావరణ వంతెనలు నిర్మిస్తున్నది. ఈ ఎకో బ్రిడ్జిల ఏర్పాటుతో కింది నుంచి వాహనాల రాకపోకలు యథావిధిగా సాగనుండగా, పై నుంచి సంచరించే జంతువులకు అడవిలోనే ఉన్న భావన కలగనున్నది.
– కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ)
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : మహారాష్ట్ర నుంచి జిల్లా అడవుల్లోకి నాలుగేళ్లుగా పులుల రాకపోకలు పెరిగాయి. ఈ నేపథ్యంలో మంచిర్యాల నుంచి చంద్రాపూర్ వరకు చేపడుతున్న జాతీయ రహదారి (నాలుగు లేన్లు) విస్తరణ పనులతో పులుల సంచారానికి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. మహారాష్ట్రలోని టైగర్ రిజర్వు ప్రాంతం నుంచి ప్రాణహిత సరిహద్దు మీదుగా జిల్లా అడవుల్లోకి ప్రవేశిస్తున్న పులులకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా పర్యావరణ వంతెన(ఏకో బ్రిడ్జిలు)లు నిర్మిస్తున్నారు. పులులు, ఇతర అడవి జంతువులు తరచుగా రోడ్డు దాటే స్థలాలను గుర్తించి.. ఆ ప్రదేశాల్లో పర్యావరణ వంతెనలు శరవేగంగా నిర్మిస్తున్నారు.
నేషనల్ హైవే అథారిటీతో కలిసి..
ప్రస్తుతం మంచిర్యాల నుంచి చంద్రాపూర్ వరకు ఉన్న జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరిస్తున్నారు. ఈ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ రోడ్డు విస్తరణ కారణంగా చంద్రాపూర్లోని తడోబా-అంథేరి పులుల సంరక్షణ ప్రాంతాల నుంచి వచ్చే పులులు స్వేచ్ఛగా తిరగలేక పోతాయంటూ ఇటీవల తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర సర్కారుకు లేఖలు రాశాయి. ఈ విషయమై నేషనల్ హైవే అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూల్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఓ నిర్ణయానికి వచ్చాయి. పులుల సంరక్షణకు ఇబ్బందులు తలెత్తకుండా పర్యావరణ వంతెనలు నిర్మించాలని నిర్ణయించాయి.
పర్యావరణ వంతెనల నిర్మాణం..
వాంకిడి-మహారాష్ట్ర సరిహద్దుల్లో, రెబ్బెన వద్ద రూ. 30 కోట్లతో ఏకో వంతెనల నిర్మాణం శరవేగంగా చేపడుతున్నారు. ఆయా చోట్ల సుమారు కిలో మీటరు మేర వంతెనలు నిర్మిస్తున్నారు. దాదాపు 150 మీటర్ల పొడవుతో వీటిని నిర్మిస్తున్నారు. వంతెన కింది నుంచి నాలుగు వరుసల రహదారిపై వాహనాల రాకపోకలు సాగనుండగా, పై నుంచి అడవి జంతువులు సంచరించేందుకు వీలుగా నిర్మాణం చేపడుతున్నారు. నాలుగు వరుసల రహదారికిరువైపులా కొండలను ఆనుకొని ఎత్తైన వాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వంతెనపై గటేర్ల ద్వారా స్లాబ్ వేస్తారు. ఏకో వంతెనపై అడవిని తలపించేలా చెట్లు, పొదలు పెంచనున్నారు. జంతువులు రోడ్డు దాటే క్రమంలో వాటికి ఏమాత్రం ఇబ్బందులు కలగకుండా అడవిలో సంచరిస్తున్న భావన కలిగేంచేలా తీర్చిదిద్దనున్నారు.
గతంలోనూ పర్యావరణ వంతెనల కోసం ప్రతిపాదనలు
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఉన్న తడోబా-అంథేరి టైగర్ రిజర్వు(టీఏటీఆర్) నుంచి తెలంగాణలోని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అడవులను కలుపుతూ ఉన్న టైగర్ కారిడార్కు పులుల సంచారం కోసం కనెక్టివిటీ పెంచేందుకు ప్రాణహిత నదిపై వంతెనలు నిర్మించాలని గతంలోనూ అధికారులు ప్రతిపాదనలు చేశారు. జిల్లా సరిహద్దులో దాదాపు 72 కిలోమీటర్ల మేరకు ప్రాణహిత నది ప్రవహిస్తోంది. బెజ్జూర్, దహెగాం మండలాల సరిహద్దుల్లో ప్రవహించే ప్రాణహితపై పర్యావరణ వంతెనల నిర్మాణాలకు గతంలో ప్రతిపాదించారు. ప్రాణహిత నదిపై పర్యావరణ వంతెనలు నిర్మించేందుకు తెలంగాణ నీటి పారుదల శాఖ కూడా అనుమతి తెలిపింది. కానీ.. నేషనల్ వైల్డ్లైఫ్ నుంచి అనుమతి లేకపోవడంతో ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. బెజ్జూర్ అటవీ పరిధిలో సలుగు పల్లి వద్ద ఒక ప్రదేశాన్నికూడా ఎంపిక చేశారు. కానీ.. ఇంతవరకు ఇది కార్యరూపం దాల్చలేదు. ఇటీవలి కాలంలో తడోబా-అంథేరి టైగర్ రిజర్వు నుంచి పులులు జిల్లాలోకి ప్రవేశించడం ఎక్కువైంది. పులుల సంచారానికి ఎలాంటి ఆటంకాలు కలుగకుండా వాంకిడి- మహారాష్ట్ర సమీపంలో ఒకటి, రెబ్బెన వద్ద ఒక వంతెన నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి.
మహారాష్ట్రలో 16 కిలో మీటర్ల మేర..
పులులు, ఇతర వణ్యప్రాణుల సంచారానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా పర్యావరణ వంతెనలను ఏర్పాటు చేస్తారు. వంతెనపై సహజమైన అడవిని తలపించేలా చెట్లు, పొదలను పెంచేందుకు అనువుగా నిర్మాణాలుంటాయి. మహారాష్ట్రలోని పెంచ్ రిజర్వ్ ఫారెస్ట్ గుండా వెళ్తున్న జాతీయ రహదారి-44లో సుమారు 16 కిలోమీటర్ల వరకు పర్యావరణ హైలెవెల్ వంతెన నిర్మించారు. అడవులకు ఎలాంటి నష్టం జరగకుండా ఈ వంతెన నిర్మా ణం చేపట్టారు. ఈ వంతెన కింది నుంచి అడవి జం తువులు, పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు అనువైన వాతారణం కల్పించారు. ప్రస్తుతం మహారాష్ట్ర -తెలంగాణ సరిహద్దుల్లోని వాంకిడి సరిహద్దు వద్దవద్ద నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణం వలన పులులు, ఇతర అటవీ జంతువుల సంచారానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా పర్యావరణ వంతెనలు(ఏకో బ్రిడ్జిలు) నిర్మాణం జరుగుతోంది.