మందమర్రి అక్టోబర్ 5: చెన్నూర్ మాజీ ఎమ్మె ల్యే, మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు దంపతులు మంత్రి కే తారకరామారావు ఆధ్వర్యంలో బీ(టీ)ఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో బుధవారం మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఆయన సతీమణి మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, వారి కుమారుడు నల్లాల శ్రావణ్కు రాష్ట్ర మంత్రి కేటీఆర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్లో ఉండి తెలంగాణ ఉద్యమంలో చెన్నూర్ నియోజక వర్గంతో పాటు కోల్బెల్ట్ ప్రాంతంలో కీలక పాత్ర పోషించిన నల్లాల ఓదెలు 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అనంతరం రాష్ట్ర సాధన కోసం పార్టీ పిలుపు మేరకు 2010లో తన పదవికి రాజీనామా చేసి మళ్లీ విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం 2014లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఓదెలు ప్రభుత్వ విప్గా పదవిలో కొనసాగారు. 2019లో జరిగిన జడ్పీ ఎన్నికల్లో ఆయన సతీమణి నల్లాల భాగ్యలక్ష్మి కోటపల్లి మండల జడ్పీటీసీగా గెలుపొంది జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లాల ఓదెలు కుటుంబ సభ్యులు ఆనతికాలంలోనే తిరిగి సొంతగూటికి చేరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నాయకత్వంలో టీఆర్ఎస్ పటిష్టంగా మారింది. ఓదెలు చేరికతో మరింత బలపడి నియోజక వర్గంలో తిరుగులేని శక్తిగా ఎదగనుండడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.