భైంసాటౌన్, మార్చి 1 : తెలంగాణ సర్కారు పట్టణాల మాదిరిగా గ్రామాల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. భైంసా మండలం కామోల్ గ్రామంలో రూ.కోటితో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను బుధవారం ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ వరుణ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పట్టణాలు, గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడమే ధ్యేయంగా సబ్స్టేషన్ల నిర్మాణాలకు నిధులు మంజూరుచేస్తున్నారన్నారు. గతంలో తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోయేదని, లో వోల్టేజీతో వినియోగదారులు అవస్థలు పడేవారని పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండాపోయిందని స్పష్టం చేశారు. ఉప కేంద్రాల ఏర్పాటుతో లోవోల్టేజీ, బ్రేక్డౌన్ సమస్యలు తీరిపోతున్నాయని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో రూ.16 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఆరోగ్య ఉపకేంద్రాలు, బస్తీ దవాఖానలను నిర్మిస్తున్నదని చెప్పారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ఆరోగ్య కేంద్రాలను అన్ని సౌకర్యాలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు.
పోచమ్మ, మహాలక్ష్మి ఆలయాలు ప్రారంభం..
గ్రామంలో రూ.కోటితో నిర్మించిన పోచమ్మ, మహాలక్ష్మి ఆలయాలను మంత్రి అల్లోల ప్రారంభించారు. ఇక్కడ మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్కు వే ద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికా రు. విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లాలో అత్యధిక ఆలయాలు మంజూరయ్యాయన్నారు. 80 శాతం ఆలయాల నిర్మాణాలు పూర్తయ్యాయని, 20 శాతం నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. ఆధ్యాత్మిక చింతనతోనే శాంతి లభిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ తిరుపతిగా పిలువబడుతున్న యాదాద్రిలో బ్రహ్మోత్సవాలను సీఎం కేసీఆర్ ఘనంగా జరిగేలా ఏర్పాటు చేయించారని తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాట్లాడుతూ.. కామోల్ గ్రామంతో తనకు మూడు తరాల అనుబంధం ఉన్నదని పేర్కొన్నారు. తన తండ్రి, దివంగత మాజీ మంత్రి గడ్డిగారి గడ్డెన్న అత్తగారి గ్రామం కామోల్ అని తెలిపారు. అలాగే తన, తన కొడుకు అత్తగారి ఊరు కూడా కామోల్ అని చెప్పారు. అనంతరం గ్రామంలో గ్రామస్తుల సాయంతో నిర్మించిన శ్రీ సరస్వతీ శిశు మందిర్ ప్రాథమిక పాఠశాల నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో పాఠశాలల్లో అనేక సౌకర్యాలు కల్పిస్తున్నదన్నారు. అలాగే నిర్మాణం పూర్తిచేసుకున్న సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముత్తవ్వ, ఎంపీపీ కల్పన జాదవ్, ఎంపీటీసీ నర్సారెడ్డి, జడ్పీటీసీ దీప, బీఆర్ఎస్ నాయకులు రాంకిషన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవేందర్రెడ్డి, బామ్ని రాజన్న, అమేందర్ రెడ్డి, గణేశ్ పటేల్, మధూకర్ రెడ్డి, భూమేశ్, వెంకట్, ఏఎంసీ మాజీ చైర్మన్ కృష్ణ, తోట రాము తదితరులు పాల్గొన్నారు.
ఎల్లపెల్లిలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన..
సోన్, మార్చి 1 : నిర్మల్ మండలం ఎల్లపెల్లి గ్రామంలో సుమారు రూ.1.30 కోట్లతో నిర్మించిన హనుమాన్ ఆలయంలో విగ్రహప్రతిష్ఠాపన కార్యక్రమంలో మంత్రి అలోల కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన, శిఖర, నవగ్రహ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయాన్నే ఆంజనేయస్వామి ఆలయంలో విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల దంపతులకు పురోహితులు ప్రవీణ్ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ స్వాగతం పలికారు. మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం 50 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎల్లపెల్లిలో హనుమాన్ ఆలయంతో పాటు శివాలయం, నవగ్రహాలు, తదితర దేవతమూర్తులను ప్రతిష్ఠించినట్లు చెప్పారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. అంతకుముందు ఆలయంలో నిర్వహించిన యంత్ర స్థాపన, ప్రాణప్రతిష్ట, శాంతి పౌష్టిక హోమం, కుంభాభిషేకం, మహాపూర్ణాహుతి పూజ కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పురాతన ఆలయాల్లో పూర్వవైభవం తీసుకొచ్చేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం దేవాలయాల నిర్మాణానికి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నదన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 600కు పైగా దేవాలయాలను నిర్మించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అల్లోల సోదరులు అల్లోల మురళీధర్రెడ్డి వినోదమ్మ, సురేందర్రెడ్డి, దేవేందర్రెడ్డి, సర్పంచ్ అల్లోల రవీందర్రెడ్డి, అల్లోల గోవర్ధన్రెడ్డి, ముఠాపూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ మహేశ్రెడ్డి, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, నాయకులు కృష్ణప్రసాద్రెడ్డి, మోహినొద్దీన్, అడ్వాల శ్రీనివాస్, పడకంటి రమేశ్రెడ్డి, చంద్రశేఖర్గౌడ్, భీంరావు, పోశెట్టి, నవాత్ గంగాధర్, కోటగిరి అశోక్, బీఆర్ఎస్ యువ నాయకులు అల్లోల గౌతంరెడ్డి, డీఎస్పీ జీవన్రెడ్డి, గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.