ఆసిఫాబాద్ టౌన్, మార్చి14: అధిక సాంద్రతలో పత్తి సాగుపై అధికారులు, రైతులు అవగాహన కలిగి ఉండాలని కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ శివకృష్ణ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ రైతు వేదికలో కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సిర్పూర్ (యూ) డివిజన్ పరిధిలోని సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులకు పత్తి సాగుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నిర్వహించిన ఒకరోజు శిక్షణలో ఆయన మాట్లాడారు. గత సంవత్సరం జాతీయ ప్రత్తి పరిశోధనా కేంద్రం, నాగపూర్ సహకారంతో మంచిర్యాల జిల్లాలో 165 ఎకరాల్లో అధిక సాంద్రత పద్ధతిలో ప్రత్తి సాగు చేశారని గుర్తు చేశారు. నేలల రకాలు, విత్తన మోతాదు, విత్తే దూరం, మొకల సంఖ్య, అందుబాటులో ఉన్న రకాలు, పెరుగుదలను నియంత్రించే ఉత్ప్రేరకాల వాడకం, పోషకాల యాజమాన్యం, కలుపు, చీడపీడల యాజమాన్యంపై సమగ్రంగా వివరించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో యాసంగి వరి పంటలో సల్ఫైడ్ దుష్ప్రభావం, జింకు లోపం, కాండం తొలుచు పురుగు ఉనికిని గుర్తించామని చెప్పారు.
సరైన సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే దిగుబడులు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని తెలిపారు. సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి డాక్టర్ శ్రీధర్ సిద్ధి మాట్లాడుతూ వరి సాగుచేసే రైతులు రకాల ఎంపికలో జాగ్రత్తలు వహించాలని, పంటకాలానికనుగుణంగా మొకల సాంద్రత సరిగా ఉండేలా దగ్గర దగ్గరగా నాటుకోవాలని సూచించారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం జగిత్యాల మృత్తికా శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ యాసంగిలో వరి పంటసాగు చేసే రైతులు జింక్ లోపం సల్ఫైడ్ దుష్ప్రభావం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస రావు మాట్లాడుతూ అధిక సాంద్రత ప్రత్తి సాగుపైన ప్రతి ఒక అధికారి అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ముఖ్యంగా సాగు విధానంపైన దృష్టి సారించి అధిక విస్తీర్ణంలో సాగు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ తిరుపతి, నాగరాజు, మండల వ్యవసాయాధికారి మంజుల, విస్తరణాధికారి రాకేశ్, రైతులు పాల్గొన్నారు.