మంచిర్యాల, అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సింగరేణి సిరుల మాగాణం మందమర్రి పట్టణం మరో అద్భుతానికి వేదికైంది. గత పాలకుల నిర్లక్ష్యం, అనాలోచిత పనితీరుతో 1/70 చట్టంలోకి పోయి అభివృద్ధికి నోచుకోలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఒక్క మందమర్రి పట్టణంలోనే దాదాపు రూ.172.35 కోట్ల అభివృద్ధి జరిగింది. తాజాగా.. రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మందమర్రి మండలం శంకర్పల్లిలో 70 ఎకరాల్లో పామాయిల్ ఫ్యాక్టరీ పనులకు భూమిపూజ చేశారు. సుమారు రూ.500 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ ఫ్యాక్టరీతో మందమర్రికి మంచిరోజులు రానున్నాయి. రెండు విడుతల్లో ఫ్యాక్టరీని అభివృద్ధి చేయనున్నారు. తొలి విడుతలో ఏడాదిలోపే పామాయిల్ మిల్ను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. రెండో దశలో రిఫైనరీని ఏర్పాటు చేయనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే లోకల్ బ్రాండ్తో పామాయిల్ మార్కెట్లోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.ఈ ఫ్యాక్టరీతో ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 1000 మందికి ఉపాధి దొరకనున్నది.
తెలంగాణలో వరి, పత్తితో పాటు ప్రత్యామ్నాయ సాగును పెంచాలి, మార్కెట్లో డిమాండ్ ఉన్న ఉత్పత్తులను మన రైతులే పండించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయిల్ పామ్ సాగును ప్రోత్స హిస్తున్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఈ సాగును ప్రోత్సహించాలనే లక్ష్యం మేరకు మంచిర్యాల జిల్లాలో 2020లోనే ప్రయోగాత్మకంగా 284 ఎకరాల్లో సాగు చేశారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రత్యేక చొరవతో ముందుగా చెన్నూర్ నియోజకవర్గంలో పలువురు రైతులు ఆయిల్ పామ్ సాగు చేశారు. దీంతో ఈ ఏడాది ఆగస్టులో ఉత్తర తెలంగాణలోనే తొలి పామాయిల్ పంట మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని కోటపల్లి, జైపూర్, మందమర్రి ప్రాంతాల్లో చేతికొచ్చింది. ఈ మండలాలకు చెందిన ఆరుగురు రైతుల నుంచి ఇప్పటికే 3 టన్నుల పంటను సైతం పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్న మ్యాట్రిక్స్ కంపెనీయే కొనుగోలు చేసింది. అది ప్రభుత్వ గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయడంతో రైతులు సంతోష పడుతున్నారు. మంచిర్యాల జిల్లాతోపాటు ఆసిఫాబాద్ జిల్లా రైతులు పండించిన పంటలను ఈ ఫ్యాక్టరీయే కొనుగోలు చేయనుంది. రెండు జిల్లాల్లో ఇప్పటివరకు 3,300 ఎకరాల్లో పామాయిల్ సాగులోకి రాగా, ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 5 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆయిల్ పామ్ సాగు చేసిన వేలాది మంది రైతులకు మేలు చేస్తూ.. స్థానిక యువతకు ఉపాధి కల్పించనున్న ఫ్యాక్టరీ రాకపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నేను 2020లో ఐదెకరాల్లో పామాయిల్ వేసిన. ఈ ఏడాది ఆగస్టు చివరి వారంలో కొన్ని చెట్లు కోతకు వచ్చినయ్. తొలి కోతలో 4 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మొక్కలు ఇచ్చిన కంపెనోళ్లే వచ్చి క్వింటాకు రూ.1390 చొప్పున కొనుగోలు చేసి పోయారు. ఇది ఒకేసారి వచ్చే క్రాప్ కాదు. ప్రతి 15 రోజులకోసారి క్రాప్ వస్తున్నది. మాది కొత్త పంట కావడంతో నెల రోజులకు ఒకసారి కోయాలి. ఇతర పంటలతో పోలిస్తే శ్రమ చాలా తక్కువ. నీటి అవసరం కూడా తక్కువ. చెట్టు చుట్టూ పదును ఉండేలా చూసుకుంటే చాలు. అంతర పంటలు సైతం సాగు చేసుకోవచ్చు. చాలా ఆనందంగా ఉంది. ఫ్యాక్టరీ వస్తే మా దగ్గర మరింత మంది రైతులు పామాయిల్ సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
– రైతు అనుగు ఆశురెడ్డి, అందుగులపేట , మందమర్రి
నేను 2020లో నాలుగెకరాలు, మరుసటి ఏడాది మరో 4 ఎకరాల్లో పామాయిల్ సాగు చేసిన. నెలన్నర కిందట ఆరు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. నాకు మొక్కలు ఇచ్చిన కంపెనోళ్లే వచ్చి కొనుగోలు చేసిన్రు. ఇప్పుడు మా మందమర్రిలోనే ఫ్యాక్టరీ పెడుతున్నరు. మరో 10 రోజుల్లో ఇంకో క్రాప్ కూడా వస్తది. ఇతర పంటలతో పోలిస్తే శ్రమ తక్కువ, లాభాలు ఎక్కువగా ఉంటాయి. అదే వరి రెండుసార్లు సాగు చేస్తే ఏడా దిలో ఆరు నుంచి ఏడుసార్లు మందులు వేయాలి. ఆయిల్ పామ్కు నాలుగుసార్లు వేస్తే చాలు. రానున్న రోజుల్లో మంచి లాభాలు వస్తాయన్న నమ్మకం ఉంది.
– ఎండీ జహీరుద్దీన్, రైతు, బొక్కలగుట్ట
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వచ్చే ఏడాది ఈ సమయానికల్లా పామాయిల్ ఫ్యాక్టరీలో మిల్ను ప్రారంభిస్తాం. ఆ తర్వాత రిఫైనరీని అందుబాటులోకి తీసుకొస్తం. ఇప్పటికే 284 ఎకరాల్లో పంట కోతకు వచ్చింది. ఆరుగురు రైతుల నుంచి టన్నుకు రూ.13,905 చొప్పున చెల్లించి.. మూడు టన్నులు కొనుగోలు చేశాం. రైతులతోపాటు ఇంజినీరింగ్, ఐటీఐ, ఫుడ్ టెక్నాలజీ కోర్సులు చేసిన యువతకు ఈ ఫ్యాక్టరీలో ఉపాధి దొరుకుతుంది. పరోక్షంగా ట్రాన్స్పోర్ట్, ఇతర షాపుల ఏర్పాటుతో చాలా మందికి మేలు జరుగుతుంది. ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టడం ద్వారా చుట్టు పక్కల ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగుపడి అభివృద్ధి చెందే వీలుంది.
– ఉదయ్కుమార్, సీఈవో, మ్యాట్రిక్స్ పామాయిల్ కంపెనీ