మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 1 : మంచిర్యాల పట్టణంలోని అండాళమ్మకాలనీలోగల మున్సిపల్ డంప్యార్డును సోమవారం పొల్యుషన్ కంట్రోల్బోర్డు, మున్సిపల్ అధికారులు పరిశీలించారు. డంప్యార్డులో తరచూ మంటలు చెలరేగడం, దట్టమైన పొగ వ్యాప్తి చెందడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆమ్ ఆద్మీపార్టీ జిల్లా కన్వీనర్ నయీంపాషా జాతీయ హరిత ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపేందుకు పొల్యుషన్ బోర్డు జాయింట్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ హన్మంతరెడ్డి, జోనల్ ఆఫీసర్ లక్ష్మణ్ప్రసాద్ మంచిర్యాలకు వచ్చారు.
వారి వెంట మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ సునీల్రాథోడ్, సిబ్బంది ఉన్నారు. పలు అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా డంప్యార్డు ఇక్కడి నుంచి తొలగించి, ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలని సూచించారు. అనంతరం వారంతా కలిసి అదనపు కలెక్టర్ రాహుల్ను కలిశారు. త్వరలోనే డంప్యార్డు కోసం స్థలాన్ని కేటాయించడం జరుగుతుందని ఆయన చెప్పారు.