ఆదిలాబాద్ టౌన్, మార్చి 2 : పేదల పాలిట ఆపన్నహస్తం సీఎం సహాయనిధి అని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆరోగ్య పరిరక్షణకు సీఎం సహాయనిధి దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు అజయ్, వెనగంటి ప్రకాశ్, ఆవుల వెంకన్న, పోతన్న యాదవ్, రామకృష్ణ పాల్గొన్నారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించేలా కష్టపడి చదువుతూ తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గురువారం నిర్వహించిన స్పోర్ట్స్ అండ్ యానువల్ డే వేడుకలకు ఆయన హాజరయ్యారు. ముందుగా కార్యక్రమ అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్ను శాలువాతో సన్మానించారు. విద్యార్థినులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ కళాశాలలో మెరుగైన విద్యాబోధన అందిస్తూ అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. జిల్లాలో ఐటీ టవర్ నిర్మాణానికి మూడెకరాల స్థల కేటాయింపుతో సహా రూ.40 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని వివరించారు. హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే ఐటీ రంగంలో ఉద్యోగ కల్పనకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అవకాశాలను వినియోగించుకుంటూ జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఐఈవో రవీందర్, ప్రిన్సిపాల్ భగవండ్లు, అధ్యాపకులు సరిత, ప్రేమ్రెడ్డి పాల్గొన్నారు.