ఎదులాపురం, డిసెంబర్ 4 : ఆదిలాబాద్లో చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ కాంట్రాక్టర్లకు సూచించారు. భాగ్యనగర్లోని ఓపెన్ జిమ్, పంచ తత్వపార్కు, తిలక్నగర్లోని డ్రైనేజీ నిర్మాణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. భాగ్యనగర్లోని కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకొని త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో భాగంగా ప్రజా సమస్యలను గుర్తిస్తూ వాటి పరిష్కారానికి అవసరమైన పనులు చేపడుతున్నామని తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. ఆయన వెంట కౌన్సిలర్లు అశోక్ స్వామి, పందిరి భూమన్న, కొండ గణేశ్ ఉన్నారు.
ప్రజాపిత బ్రహ్మకుమారీ ధర్మభిక్షలో..
అత్యంత కఠిన నియమాలతో మండల కాలం చేపట్టే అయ్యప్ప దీక్షలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే అయ్యప్ప దీక్ష స్వీకరించిన ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్తో పాటు స్వాములకు బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో భిక్ష ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా విశ్వ విద్యాలయ నిర్వాహకురాలు రేవతి బెహన్ స్వాములకు స్వాగతం పలికారు. అనంతరం స్వాములు ప్రసాదాన్ని స్వీకరించారు. ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్, కౌన్సిలర్ లక్ష్మణ్, వేణుగోపా యాదవ్, రేవతి బెహన్ రాముబాయ్, గంగయ్య, అర్చన, గీత, సరళ పాల్గొన్నారు.
బాజీరావ్ బాబా పల్లకీ సేవలో..
ఆధ్యాత్మిక చింతన ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని క్రాంతినగర్లో నిర్వహించిన బ్రహ్మలిన్ బాజీరావ్ బాబా పుణ్యతిథి వేడుకలకు ఆయన హాజరయ్యారు. బాబా పుణ్యతిథిని పురస్కరించుకొని పల్లకీని వీధుల గుండా ఊరేగించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అశోక్ స్వామి, లింగారెడ్డి, కృష్ణ పాల్గొన్నారు.
రైతుల సమస్యల పరిష్కారానికి కృషి
టీఆర్ఎస్(బీఆర్ఎస్) సీనియర్ నాయకుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన సందర్భంగా ఆదివారం మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ కలిసి అభినందనలు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బండారి సతీశ్, లక్ష్మణ్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) సీనియర్ నాయకుడు పోతారెడ్డి, నాయకులు వేణు యాదవ్, జక్కుల రమేశ్ పాల్గొన్నారు.