భైంసాటౌన్, జనవరి 4 : అహర్నిశలు శ్రమిస్తూ దేశానికి అన్నం పెట్టే రైతన్నపై మరోమారు కేంద్రం విషం కక్కింది. ఇప్పటికే నల్లచట్టాలతో అన్నదాతను దెబ్బకొట్టిన బీజేపీ.. వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం చేయాలని రైతు సంఘాలు, రైతులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏండ్లుగా కోరుతున్నా కుదరదని తేల్చిచెప్పింది. స్వయంగా దీనిపై నీతి అయోగ్ నివేదిక సమర్పించినా.. ససేమిరా అంటున్నది. ప్రజలకు మంచి చేయాలనే తపన తమకే ఉందంటూ అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ.. అటు వైపు చూడకపోవడం విస్మయానికి గురిచేస్తున్నది. ఈ పథకం అనుసంధానంతో రైతులకు 30 శాతం మేలు కలుగుతుందని మేధావులు, రాజకీయ అనుభవజ్ఞులు అభిప్రాయపడుతున్నా పట్టించుకోకపోవడంపై రైతన్నల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
వ్యవసాయానికి ఉపాధి హమీ పథకం అనుసంధానం చేయడం వల్ల రైతులకు పంట పొలాల్లో వివిధ పనులకు మేలు కలుగుతుందని రైతు సంఘాలు, రైతులు, రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటున్నది. ఈ విషయంలో ఎన్నోమార్లు కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలను అందించింది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి రైతులపై విషం కక్కింది. ఎట్టి పరిస్థితుల్లో ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయడం కుదరదని తేల్చిచెప్పింది. దీంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి కేంద్రం నిర్ణయంపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నీతి ఆయోగ్ నివేదిక.. పట్టని కేంద్రం..
వ్యవసాయ పనులకు ఖర్చు పెరిగింది. దిగుబడి మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నది. ఈ తరుణంలో ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని నీతిఆయోగ్ నివేదిక సమర్పించింది. రైతుల పాలిట వరంలా మా రినా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడంతో రైతన్నలు ఆశలు సన్నగిల్లాయి. ప్రజలకు మంచి చేయాలనే తపన తమకే ఉందంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ.. నిత్యావసర ధరలు ఇష్టానుసారంగా పెంచుతూ మంచి చేసే సమయం ఉన్నప్పటికీ అటు వైపు చూడడం లేదు. దీంతో రైతులు, రైతు సంఘాల నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అనుసంధానంతో 30 శాతం మేలు ..
వ్యవసాయ పనులకు ఉపాధి హమీ పథకం అనుసంధానం చేస్తే రైతులకు 30 శాతం మేలు కలుగుతుందని మేధావులు, రాజకీయ అనుభవజ్ఞులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉంచుతూ రైతు వెన్నంటే ఉంటున్నది. రైతుబంధు, రైతుభీమాతో పాటు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు తదితర సదుపాయాలు కల్పిస్తున్నది. కూలీల కొరత, నకిలీ విత్తనాలు, తెగులు, ప్రకృతి వైపరీత్యాలు, పెరిగిన పెట్టుబడులతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటినీ తట్టుకొని సాగు చేస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం మాత్రం సాయం చేయడంలో ససేమిరా అంటున్నదని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి, పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
కేంద్రం ఆలోచించాలి..
పది మందికి అన్నం పెట్టే రైతులకు మంచి చేస్తే తప్పు ఏముంటంది. మంచి చేస్తామని చెప్పి మర్చిపోతే ఏం చేస్తాం. కేంద్ర సర్కారు కాస్తయినా ఆలోచన చేయాలి. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేయాలి. రైతులను ఆదుకునేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఉపాధిహమీ పథకంలో పనిదినాల లక్ష్యాన్ని కుదించడం సరికాదు. గతంలో మాదిరిగా కూలీల డిమాండ్కు అనుగుణంగా పనిదినాలను పెంచే వెసులుబాటు కల్పించాలి.
– సిరిమన్ పెద్ద మాధవ్ రావు, రైతు, వానల్పాడ్
రైతులకు మేలు చేయాలి..
ప్రజలకు అందిస్తున్న ఫలాల్లో వ్యవసాయానికి ఉపాధి హమీ పథకం వర్తింపజేస్తే తప్పేముంది. ఎలాగైనా రైతులకు మేలు చేయాలనే తపన కేంద్ర ప్రభుత్వానికి లేదు. మాయమాటలు చెప్పి కాలం వెల్లదీస్తున్నది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది. కేంద్రం తీసుకొచ్చిన నిబంధనల వల్ల పథకం లక్ష్యం నీరుగారిపోయే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ సార్ మాదిరిగా రైతులకు ఉపయోగపడేలా ఉపాధిహామీలో మార్పులు చేయాలి.
– జాదవ్ వినాయక్, రైతు, వాటోలి