ఖానాపూర్ టౌన్, మార్చి 3: డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో అర్హులకు న్యాయం చేస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ తెలిపారు. పట్టణ శివారులోని కుమ్రాం భీం చౌరస్తాలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను ఎమ్మెల్యే శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. డబుల్ బెడ్ డ్రూం ఇండ్లను పూర్తి పారదర్శకంగా కేటాయించినట్లు చెప్పారు. మున్సిపాలిటీలో 700 పైగా అర్హులను గుర్తించగా, ప్రజల సమక్షంలో అధికారులు 400 మందికి ఇండ్లు కేటాయించారని వెల్లడించారు.
పట్టణంలోని 12 వార్డుల్లో క్షేత్ర స్థాయిలో సర్వే, మూడు సార్లు వార్డు సభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేసినట్లు వివరించారు. కొందరు నాయకులు చెప్పిన మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. అనర్హులపై వార్డు కౌన్సిలర్ లేదా అధికారులు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి అర్హుల జాబితా నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. మిగత వారికి సీఎం కేసీఆర్ కుమ్రం భీం చౌరస్తాలో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో మున్సిపల్ చైర్మన్ రాజేందర్, ఏఎంసీ మాజీ చైర్మన్ శంకర్, నాయకులు సురేశ్, రాజగంగన్న, శంకర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.