ఆదిలాబాద్ : దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడే ఒకే ఒక్క నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. దళిత బంధు లబ్ధిదారులకు ఎమ్మెల్యే యూనిట్లు పంపిణీ చేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలం యశ్వంత్ కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన దళిత బంధు కార్యక్రమానికి ముఖ్య అతిథిగాహాజరై డాక్టర్ బీఆర్. అంబేద్కర్, బుద్ధ భగవాన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అంతకుముందు అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు.అనంతరం 15 మంది లబ్ధిదారు కుటుంబాలకు దళిత బంధు యూనిట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కృషి చేస్తున్నారని ప్రశంసించారు. గత పాలకులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందుకు ప్రస్తావించలేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ ఉద్యమ ఫలితం..అమరుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రానికి గట్టి పునాదిని వేసుకున్నాం. నేడు ప్రతి ఒక్క కులం ఆత్మ గౌరవంతో బతికేలా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.