ఆదిలాబాద్ : రాష్ట్రంలో 90% మంది కూలీనాలి చేసుకునే వారే ఉన్నారని, వారికి తోడ్పాటు నిచ్చేలా ఆడపడుచులకు బతుకమ్మ పండుగకు కొత్త చీరెలు కానుకగా అందిస్తారని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలో ఆదివారం ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు, యువతులకు బతుకమ్మ చీరెలు అందించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కడుపులో ఉన్న బిడ్డ నుంచి వారికి అందించాల్సిన పోషకాహారం వారి ఉన్నత చదువులు, తల్లి రక్షణ అన్నింటినీ ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. గత ప్రభుత్వాల కంటే సీఎం కేసీఆర్ పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయన్నారు.
సీఎం కేసీఆర్ తీసుకున్నటువంటి బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి పథకాలు వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి బిజెపి, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎందుకు చేపట్టడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
రాబోయే తరానికి ప్రజలకు సేవలు అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై యువత టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతూ సేవలందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.