మంచిర్యాల, ఏప్రిల్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎన్నికల కోడ్ వేళ ఎవ్వరూ రూ.50 వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లడానికి వీళ్లేదు. సరైనా ఆధారాలు లేకుండా డబ్బులు తీసుకెళ్తే వాటిని అధికారులు సీజ్ చేస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఉన్నట్లు ఉంది. మొన్నీ మధ్యే ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి మంచిర్యాల ఈగ్దాలో కాంగ్రెస్కు ఓటేయాలంటూ పిలుపునిచ్చిన ఘటన మరవకముందే.. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం ఓ ఆలయానికి వెళ్లిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు రూ.లక్ష విరాళంగా అందజేశారు.
పాత మంచిర్యాలలోని ఓ ఆలయానికి పేయింటింగ్ వేసేందుకు ఈ మొత్తం ఇచ్చినట్లు చెప్తున్నారు. కాగా.. ఎన్నికల కోడ్ ఉండగా ఓటర్లను ప్రభావితం చేసేలా ఎలాంటి డబ్బులు పంపిణీ చేయకూడదనే నిబంధన ఉంది. కానీ.. దానిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఎమ్మెల్యే ఆలయానికి డబ్బులు ఇవ్వడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇలా వరుసగా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే ఇలా డబ్బులు విరాళంగా అందించవచ్చా అనే అంశాలపై మంచిర్యాల ఎన్నికల అధికారి ఆర్డీవో రాములును వివరణ కోరేందుకు ‘నమస్తే తెలంగాణ’ ప్రయత్నించగా ఆయన ఫోన్లో అందుబాటులోకి రాలేదు.