దండేపల్లి, జూలై 18 : వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలంటున్న కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని, పల్లెల్లోకి వస్తే అడుగడుగునా నిలదీయాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పిలుపునిచ్చారు. దండేపల్లి మండల కేంద్రంలోని ద్వారక రైతు వేదికలో మంగళవారం రైతులతో కలిసి ఏర్పాటు చేసిన చర్చా వేదికలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ మూడు గంటల కరెంటు, కేసీఆర్ మూడు పంటల విధానంపై గ్రామాల్లో చర్చ పెట్టాలని అన్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో 24 గంటల కరెంటు ఇస్తున్నారా.? అని నిలదీశారు. చేతి గుర్తుకు ఓటెస్తే రాష్ట్రం మళ్లీ అంధకారంలోకి వెళ్తుందని, ఐదు దశాబ్దాల పాటు ఎరువులు, నీళ్లు ఇవ్వకుండా, ప్రాజెక్టులు కట్టకుండా చెరువులు బాగుచేయకుండా వ్యవసాయాన్ని అధోగతిపాలు చేసి రైతన్నల ఆత్మహత్యలకు కారణమైందని మండిపడ్డారు. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న తెలంగాణ రైతుల కడుపు కొట్టే విధంగా రేవంత్రెడ్డి మాట్లాడుతున్నాడని, రైతులంతా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.
సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయతో చెరువులు బాగుచేస్తూనే మరోవైపు రైతుబంధు వంటి విప్లవాత్మక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ గురువయ్య, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ అనిల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు చుంచు శ్రీనివాస్, సర్పంచ్ శాంతయ్య, బీఆర్ఎస్ నాయకులు శంకర్రావు, మైదం గంగారెడ్డి, అంబటిపెల్లి రవి, ఇప్ప రమేశ్, యెలుగూరి వేణు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.