ఎదులాపురం, నవంబర్ 23 : కేంద్రం ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోలేని అసమర్థ నాయకుడు బీజేపీ ఎంపీ సోయం బాపురావు అని ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని కేఆర్కే, పిట్టలవాడ, కైలాస్నగర్లో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వివిధ కాలనీలకు వచ్చిన ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మరోసారి అభివృద్ధికి పట్టం కట్టాలన్నారు. 60ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజానీకానికి చేసిందేమి లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని వివరించారు.
ఎంపీగా గెలిచిన తర్వాత ఏ అభివృద్ధి పనిని చేపట్టని స్థానిక బీజేపీ నాయకులు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. బీజేపీకి అభివృద్ధిపై ఎంతమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. .కాంగ్రెస్ నేతల వైఖరిపై సైతం ధ్వజమెత్తారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అంజుబాయి. ధమ్మపాల్ సంగీత, అర్చన రాంకుమార్, భరత్కుమార్, బీఆర్ఎస్ అధికార ప్రధినిధి గంగారెడ్డి, ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, సీనియర్ నాయకులు యూనిస్ అక్బానీ, దుర్గం శేఖర్, సలీంపాషా, ఆశన్న, దాసరి రమేశ్, నవాతే శ్రీనివాస్, చిన్న పటేల్ ,మున్నా తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే అభ్యర్థికి ఘన స్వాగతం
ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 23: ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న కైలాస్నగర్ వచ్చిన సందర్భంగా 38వ వార్డు కౌన్సిలర్ ఎల్మల్వార్ అర్చన రాంకుమార్తో పాటు స్థానిక పార్టీ నాయకులు దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, చిట్టి బాబు, సురేందర్ మౌర్య, సంతోష్, సాయి, నందు, మహిళలు కలిసి ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం వార్డులో తిరుగుతూ ఈ నెల 30వ తేదీన జరిగే ఎన్నికల్లో కారు గుర్తు రెండో నంబర్కు ఓటు వేయాలని గడపగడపకూ ప్రచారం చేశారు. భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.