ఎదులాపురం,జూన్17: రాష్ట్ర ప్రభుత్వం దళిత అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ క్వార్టర్స్లో రూ.2కోట్లతో నిర్మించిన అంబేద్కర్ భవనాన్ని ఎమ్మెల్యే జోగు రామన్న శనివారం ప్రారంభించారు. ముందుగా శిలాఫలకాన్ని జిల్లా దళిత సంక్షేమ సంఘం అధికారి భగత్ సునీత కుమారితో కలిసి ఆవిష్కరించారు. అంబేద్కర్ చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడారు. రాష్ట్ర అవరతణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజన దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ భవనాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. త్వరలో దళిత సంఘాల నాయకుల ఆలోచల మేరకు జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్థన్, కలెక్టర్ రాహుల్ రాజ్లకు పెద్ద ఎత్తున సన్మాన సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ 125 అడుగల అంబేద్కర్ విగ్రహానిక్న ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. భవనంలో మరి కొన్ని పనులు చేయాల్సి ఉందన్నారు. ప్రహరీ, షెడ్డు నిర్మాణం, తదితర వాటికి అదనంగా నిధులు కేటాయించి పనులు పూర్తి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, అంబేద్కర్ మెమోరియల్ అసొసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాబా సాహెబ్ కాంబ్లే, పట్టణ అధ్యక్షుడు అలాల అజయ్, నేతకాని మహార్ సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్గం శేఖర్, దళిత సంఘం నాయకులు రాజన్న, శైలేందర్, అల్లూరి భూమన్న, మల్యాల స్వామి, సొగల సుదర్శన్, ఎంపీటీసీ బీ గంగాధర్, మాజీ జడ్పీటీసీ ఇజ్జగిరి అశోక్, కౌన్సిలర్ అర్చన రామ్కుమార్, ప్రజ్ఞాకుమార్, మల్యాల మనోజ్ కుమార్, చంద్రకళ, సర్పె సోంబాయి, ఉజ్వలాబాయి తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్కు సన్మానం
ఆదిలాబాద్ మున్సిపాలిటీ వివిధ విభాగాల్లో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయిలో అవార్డు సొంతం చేసుకుంది. అంబేద్కర్ భవనం ప్రారంభం అనంతరం నేతకాని మహార్ జిల్లా అధ్యక్షుడు, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ను సత్కరించారు. ఆస్తి పన్నుల వసూళ్లలో ఆదిలాబాద్ మూడో స్థానంలో ఉండడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు గాను మున్సిపాలిటీకి అవార్డు దక్కిందని దుర్గం శేఖర్ అన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే జోగురామన్న సహకారంతోనే సాధ్యమవుతుందని చెప్పారు.