ఎదులాపురం,మే6: మహిళల ఆత్మ గౌరవాన్ని మరింత పెంచేలా నూతన సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ముందుకు సాగుతున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీడీసీ సమావేశ మందిర ప్రాంగణంలో శనివారం ఏర్పా టు చేసిన కార్యక్రమంలో జైనథ్, మావల, ఆదిలాబాద్ గ్రామీణ మండలాల ఐకేపీ మండల సమాఖ్య సభ్యులకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు.
ట్రాక్టర్లు అవసరమైన వారు వాటిని వినియోగించుకొని సమాఖ్యలకు అద్దె చెల్లించనున్నారు. ఇందుకు ఆయా మండల సమాఖ్యలు రూ.7.50 లక్షలు చెల్లించగా, ప్రభుత్వం రూ.2.50 లక్షల సబ్సిడీ అందించింది. ఆయా మండలాలకు కేటాయించిన ట్రాక్టర్లకు ఎమ్మెల్యే పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం వాటిని సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కస్టమ్ హైరింగ్ సెంటర్ల కోసం ఒక్కో ఐకేపీ మండల సమాఖ్యకు ట్రాక్టర్ అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలు రాబోయే రోజుల్లో మరిన్ని వ్యాపారాలు చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుందన్నారు.
బీఆర్ఎస్లోకి బీజేపీ సీనియర్ నాయకుడు
బీజేపీ మైనార్టీ విభాగం సీనియర్ నాయకుడు అబ్దుల్ ఖాసీం ఎమ్మెల్యే జోగు రామన్న సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జైనథ్ ఎంపీపీ మార్శెటి గోవర్ధన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అలాల్ అజయ్, నాయకులు నల్ల రాజేశ్వర్, ఏవన్, వెంకట్ రెడ్డి, మెట్టు ప్రహ్లాద్, దయాకర్, భూమన్న నవీన్ పాల్గొన్నారు.