తాంసి(తలమడుగు), నవంబర్ 5 : సీఎం కేసీఆర్ పాలనలోనే గ్రామాలు సుభిక్షంగా ఉన్నాయని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో ఆదివారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. జాదవ్ అనిల్కు మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పిడుగు సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీ సంఘం మండల యువ నాయకుడు మేకల రవికాంత్ యాదవ్ వారి అనుచరులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ కుల సంఘాల నాయకులు, బీసీ యువజన సంఘాల నాయకులు వెయ్యి మందికి పైగా బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థులు జోగు రామన్న, జాదవ్ అనిల్, మాజీ ఎంపీ నగేశ్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు ఎంతో అభివృద్ధి సాధించాయన్నారు. గ్రామాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడారు. యువకులు మేధావులు, రైతులు, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. ప్రజా సంక్షేమ కోసం పని చేస్తున్న ప్రభుత్వాలను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలను ఇస్తున్నదన్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇక్కడ ప్రకటించిన పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని, ఆ పార్టీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలు చేయవద్దని కోరారు. కులమతాల గురించి మాట్లాడే బీజేపీని పట్టించుకోకుండా ఇంటి పార్టీ బీఆర్ఎస్ను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ప్రజల కోసం పని చేసే పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కార్యకర్తలను కోరారు. ప్రతి కార్యకర్తకు తాను అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.
కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేద్దాం
దేశానికే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్పై కాంగ్రెస్, బీజేపీ నేతలు చేస్తున్న విష ప్రచారాన్ని నియోజకవర్గంలో అన్ని స్థాయిల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ తిప్పి కొడుతున్నారు. తొమ్మిది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో జరిగిన ప్రగతి 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గానికి పట్టిన దుర్గతిని కండ్లకు కడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ముందుకు దూసుకుపోతున్నాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రలను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న ప్రచారంలో నిజానిజాలు తమకు తెలుసని ప్రజలు బీఆర్ఎస్కు బాసటగా మన బోథ్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడం కోసం జాదవ్ అనిల్ను ఆశీర్వదించి ఈ నెల 30వ తేదీన మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ నామినేషన్ వేసి భారీ మెజార్టీతో గెలవాలని అర్లి గ్రామస్తులు కోరారు. నామినేషన్ కోసం రూ.50 వేలు విరాళంగా అందించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మేకల రవికాంత్ యాదవ్, కళ్లెం కరుణాకర్ రెడ్డి, వసంత్ రెడ్డి, నేతుల గంగన్న, అసం రవీందర్, అభిరాం రెడ్డి, శ్రీకాంత్, ఎంపీపీ సురకుంటి మంజులాశ్రీధర్ రెడ్డి, మొట్టె కిరణ్కుమార్, తొట వెంకటేశ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.