బెల్లంపల్లి, జనవరి 18: ప్రభుత్వ అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్, కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. గురువారం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కొనసాగుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనులను పర్యవేక్షించి సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఉప కేంద్రాల నిర్మాణాలకు ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపించాలని తెలిపారు. పాఠశాలల్లో మూత్రశాలల నిర్మాణాలను రెండు నెలలలోగా పూర్తి చేసేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు.
విద్యుత్, వ్యవసాయ, నీటిపారుదల, ఉద్యానవన, పురపాలక, ఇతరశాఖల పరిధిలో సాగుతున్న అభివృద్ధి పనులపై పదిరోజుల్లోగా మండలాలల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని, అందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. విధులపై అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో హరికృష్ణ, డీఆర్డీవో శేషాద్రి, ముఖ్య ప్రణాళికాధికారి సత్యం, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల జీఎంలు మనోహర్, రవిప్రసాద్, నియోజకవర్గంలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మందమర్రి రూరల్ జనవరి18: మందమర్రి మండలంలోని మామిడిగట్టు గ్రామ పంచాయతీలో జీపీడీపీ ప్రణాళికల తయారీపై గురువారం ఏర్పాటు చేసిన గ్రామ సభలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ హాజరయ్యారు. సర్పంచ్ రాయలింగు అభివృద్ధి పనుల వివరాలు తెలిపారు. అభివృద్ధి ప్రణాళికలపై అదనపు కలెక్టర్ సూచనలి ఇచ్చారు. అనంతరంనర్సరీని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు.
అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. సంవత్సరం నుంచి రేషన్ బియ్యం సరఫరా చేయడం లేదని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా తహసీల్దార్తో మాట్లాడి సమస్య పరిష్కరించాలని సూచించారు. ఆదిల్పేట్లో నర్సరీని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వెంకటాపూర్ గ్రామసభలో పాల్గొన్నారు. అనంతరం నర్సరీని సందర్శించి సం తృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవో శశికళ, ఎంపీవో భీరయ్య, సర్పంచ్లు, కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది ఉన్నారు.
వేమనపల్లి, జనవరి 18 : మండలంలోని సుంపుటం, కల్లెంపల్లి, రాజారాం, దస్నాపూర్ గ్రామాల్లో సర్పంచ్లు తలండి స్వరూపారాణి, కొండగొర్ల బాపు, కుస్రం పద్మ, తాటిపాముల రాజేశ్వరి, స్పె షల్ ఆఫీసర్ బాపు అధ్యక్షతన గ్రామపంచాయతీల అభివృద్ధి ప్రణాళికలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఎంపీవో బాపురావు మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు నిర్దేశించిన గడువులోగా ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్లో నమోదు చేయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, కార్యదర్శులు సిరాజ్, సంతోష్, సుదర్శన్, పోశం, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.
జైపూర్, జనవరి 18: గ్రామ, మండలస్థాయి అభివృద్ధి ప్రణాళికల తయారీలో భాగంగా మండలంలోని వివిధ గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో గురువారం గ్రామసభలు నిర్వహించారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రజలు, పాలకవర్గం సమక్షంలో చర్చించారు. వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో అనిల్, ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్లు పాల్గొన్నారు.
కోటపల్లి, జనవరి 18 : కోటపల్లి మండలంలోని దేవులవాడ, రాంపూర్, ఎదుల్లబంధం, లింగన్నపేట, పారుపల్లి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్పై గ్రామసభను నిర్వహించారు. అభివృద్ధి పనులపై ప్రణాళిక తయారు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు రమేశ్, పిల్లి భారతి, నిర్మల, దాగామ రాజు, వెంకటమ్మ, పంచాయతీ కార్యదర్శులు దాము, కోట శ్యామల, సమ్మయ్య, సద్దనపు శిల్పాచారి, రాజలింగు, గ్రామస్తులున్నారు.
భీమారం, జనవరి 18 : మండలంలోని బూర్గుపల్లి, నర్సింగాపూర్ గ్రామాల్లో చేపట్టిన గ్రామ సభల్లో ఎంపీడీవో శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రామాల్లో చేపట్టే పారిశుధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. అనంతరం అభివృద్ధి ప్రణాళికలు రూపొందించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్లు, స్థానికులు పాల్గొన్నారు.