మంచిర్యాల, జూలై 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి): అది బుద్దారం. అడవిలో వెలిసిన చిన్న గ్రామం. ఆ ఊరికి వెళ్లాలంటే అడవి గుండా మాత్రమే పోవాలి. గొంతు తడవాలంటే మైళ్లదూరం వెళ్లాలి. గాలొచ్చినా, చినుకు రాలినా కరంటు చిటుక్కున పోతుంది. ఇగ ఎప్పుడ స్తుందో తెలియని ధైన్యం. ఆ చీకట్లోనే రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడపాలి. రోగమొచ్చినా, నొప్పొచ్చినా ఏ అర్ధరాత్రి అయినా అడవిలో దారి లేకపోవడంతో నడుచుకుంటూ వెళ్లాలి. దవాఖానకు వెళ్లేలోపు ప్రాణం ఉంటదో.. పోతదో తెలియని దౌర్భాగ్య దుస్థితి. దారి తప్పామో కూృరమృగాలకు, విష ప్రాణులకు బలికావాల్సిందే. ఇగ, ఎండాకాలంలో దాహం తీరే ‘దారి’లేక ప్రాణాలు పోయిన సందర్భాలు అనేకం. ఏడేండ్ల క్రితం ఇద్దరు పిల్లలు దాహానికి తట్టుకోలేక ప్రాణాలు వదిలారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కానీ.. అప్పుడున్న కాంగ్రెసోళ్లు, టీడీపోళ్లు ఇక్కడి నుంచి మంత్రులుగా పని చేసి కూడా ఆ ఊరుకు వెళ్లిన పాపాన పోలేదు. కానీ.. తెలంగాణ వచ్చాక ఆ ఊరు రూపురేఖలు మారిపోయాయి. రోడ్డొచ్చింది. కరంటు కష్టాలు తీరాయి. దాహం తీర్చడానికి ఇంటింటికీ మిషన్ భగీరథ కింద శుద్ధజలం అందిస్తున్నారు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని బుద్దారంలో జరిగిన సంఘటనను రాష్ట్ర సర్కారు సీరియస్గా తీసుకుంది. 2016 సంవత్సరంలో చెన్నూర్ నుంచి బుద్దారం గ్రామానికి రూ.2.40 కోట్లతో పది కిలోమీటర్ల మేర రోడ్డు వేయించింది. ఆ ఊరికి వెళ్లే దారిలోని కన్నెపల్లి వాగుపై వంతెన నిర్మించింది. అప్పటి వరకు పాడుబడ్డ ట్యాంక్తో నీటి సరఫరా జరిగిన బుద్దారానికి మిషన్ భగీరథ ద్వారా శుద్ధజలం అందిస్తున్నది. రూ.7.73 లక్షలతో ఇంటింటికీ తాగునీటి నల్లాలు బిగించింది. సింగిల్ ఫేజ్ కరంట్ సరఫరాతో ఇబ్బంది పడ్డ ఆ గ్రామానికి మూడేళ్ల క్రితం రూ.1.20 లక్షలతో త్రీఫేజ్ కరెంట్ వచ్చింది. అంతర్గత రోడ్డంటే ఏంటో తెలియని ఆ ఊరిలో ఈ మధ్య కాలంలోనే రూ.8 లక్షలతో కొంతమేర సీసీ రోడ్లు పడ్డాయి. మరిన్ని రోడ్లు మంజూరు కానున్నాయి. తెలంగాణ వచ్చాకే మా ఊరు బాగు పడిందని, అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తున్నదని గ్రామస్తులు చెబుతున్నారు. గడిచిన ఏడేండ్లలో రూపురేఖలు మార్చుకున్న బుద్ధారం గ్రామంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
ప్రాణాలు తీసిన దాహం..
అది మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలోని బుద్దారం. ఆ గ్రామానికి దారి లేదు. అడవిలో నుంచి నడుచుకుంటూ వెళ్లాలి. 2016 మే 1వ తేదీన జరిగిన ఘటన ఆ ఊరు మొత్తాన్ని విషాదంలో ముంచేసింది. బిడ్డ పెళ్లి కోసమని లచ్చక్క తన ఇద్దరు పిల్లలను తీసుకొని లింగంపల్లి నుంచి బుద్దారం అడవి గుండా నడుచుకుంటూ వెళ్తున్నది. నడి వేసవి కావడంతో అడవిలో కొద్ది దూరం వెళ్లగానే పిల్లలిద్దరూ దాహం అన్నారు. వారిని అక్కడే ఉండమని చెప్పి నీటి కోసమని వెళ్లిన ఆ తల్లి స్పృహ తప్పి పడిపోయింది. చాలా సేపు అమ్మ వస్తుందని ఎదురుచూసిన ఆ పిల్లలు అశోక్ (8), మధు(12) ఎండదెబ్బ తట్టుకోలేక, దాహానికి తట్టుకోలేక ప్రాణాలు విడిచారు. మరునాడు దారిన వెళ్లే ఓ పెద్దమనిషి స్పృహ తప్పిన లచ్చక్కను గుర్తించి సురక్షితంగా బంధువులకు అప్పగించాడు. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది.
భగీరథ జల ప్రవాహం..
బుద్దారంలో పిల్లలు మృతిచెందిన కొన్నాళ్లకు మిషన్ భగీరథ పథకం ప్రారంభమైంది. ఈ పథకం కింద ఆ ఊరిలో 80 ఆవాసాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. ఇద్దరు కొడుకులను పోగొట్టుకున్న లచ్చక్క ఇంటికి కూడా మిషన్ భగీరథ ద్వారా శుద్ధజలం అందుతున్నది. దీనికితోడు రాష్ట్ర సర్కారు ప్రత్యేక చొరవతో తారు రోడ్డు వేశారు. ఒకప్పుడు కాలి నడకన, ఎడ్ల బండిలో గంటల తరబడి ప్రయాణం చేసిన వారు ఆటోలు, బైక్లు, కార్లలో నిమిషాల వ్యవధిలో వెళ్తున్నారు. ఒకప్పుడు సింగిల్ ఫేజ్ మాత్రమే ఉండగా.. ప్రస్తుతం త్రీఫేజ్ కరంటు సరఫరా అవుతున్నది. గింత మంచి చేసే సర్కార్ అప్పుడే ఉండి ఉంటే నా ఇద్దరు కొడుకులు బతికేటోళ్లంటూ లచ్చక్క భగీరథ నీటిని పట్టుకుంటూ కన్నీటి పర్యంతమవుతూ తెలిపింది.
అప్పుడే కేసీఆర్ ఉంటే నా బిడ్డలు బతికేటోళ్లు..
నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. పదేళ్ల క్రితం భర్త చనిపోయారు. పెద్ద కూతురు మంజుల బుద్దారంలో ఉంటుంది. మా ఆర్థిక పరిస్థితి బాగోలేక 2016లో మా అల్లుడు ఆయన స్వగ్రామమైన బుద్దారంలోనే పెండ్లికి ఏర్పాట్లు చేశాడు. దానికోసం మా ఊరు లింగంపల్లి నుంచి ఇక్కడికి వస్తుంటే అడవిలో తప్పిపోయినం. ఎండకు పిల్లలిద్దరూ దాహం వేస్తుందంటే నీళ్ల కోసం వెతుక్కుంటూ అడవిలోకి పోయి సొమ్మసిల్లి పడిపోయిన. తెల్లారి ఓ పెద్దమనిషి చూసి ఇంటికి తీసుకొచ్చిండు. కానీ.. అప్పటికే నా కొడుకులు ఇద్దరూ చనిపోయారు. అప్పటి నుంచి నేను బుద్ధారంలోనే ఉంటున్న. ఇప్పుడు సర్కారు ఈ ఊరుకు రోడ్డు వేసింది. అంతకుముందే కేసీఆర్ ఉంటే మా ఊరుకు రోడ్డు ఎప్పుడో వచ్చేది. నా బిడ్డలు బతికేటోళ్లు.
– లచ్చక్క, 2016లో ఇద్దరి పిల్లలను కోల్పోయిన తల్లి.
మా ఊరు బాగుపడింది..
తెలంగాణ సర్కారు వచ్చాకే మా బుద్దారం బాగు పడింది. మా ఊరుకు రోడ్డు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అది నెరవేరిందంటే కేసీఆర్తోనే సాధ్యమైంది. ఒకప్పుడు మా ఊరును పట్టించుకున్నోళ్లు లేరు. కానీ.. బాల్క సుమన్ గెలిచాక మాకు నిధులొచ్చాయి. మా ఊరుకు త్రీఫేజ్ కరంట్ వచ్చింది. ఇంటింటికీ తాగునీరు ఇస్తున్నరు. మా ఊరిలో మరిన్ని పనులు జరగాలంటే మళ్లీ కేసీఆర్ సర్కారే రావాలే.
– మడె రవి, బుద్దారం గ్రామపెద్ద.