కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : పల్లెలకు నిత్యం నీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ సిబ్బంది ఐదు నెలలుగా వేతనాలు అందక అష్టకష్టాలు పడుతున్నది. జిల్లాలోని 15 మండలాలతోపాటు ఆదిలాబాద్ జిల్లాలోని ఐదు మండలాలు, మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పరిధిలోని మూడు మండలాలకు ఆసిఫాబాద్లోని కుమ్రం భీం ప్రాజెక్టు నుంచే మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతున్నది.
వాల్ ఆపరేటర్లు, ఫిట్టర్లు, సూపర్వైజర్లు ఇలా సుమారు 600 మంది సిబ్బంది నిత్యం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ఉదయమే వెళ్లి గ్రామాలవారీగా నీటిని విడుదల చేయడంతోపాటు ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరిస్తుంటారు. వీరికి రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు వేతనాలుంటాయి. ఐదు నెలలుగా వీరికి వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణకు అష్టకష్టాలు పడుతున్నారు.
కేసీఆర్ హయాంలో సకాలంలో వేతనాలు
కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతినెలా క్రమం తప్పకుండా వేతనాలు అందేవి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో లేదో.. సిబ్బందికి వేతన కష్టాలు మొదలయ్యాయి. పైగా మిషన్ భగీరథ నీటి సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయి. అసలే వేసవి.. తాగు నీరు సరఫరాలో అంతరాయం కలుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి సకాలంలో వేతనాలు అందించాలని మిషన్ భగీరథ సిబ్బంది కోరుతుండగా, సక్రమంగా తాగు నీరు సరఫరా చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఐదు నెలలుగా జీతాలిస్తలేరు..
నిత్యం గ్రామాల్లో తిరుగుతూ తాగు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటం. సమస్య వస్తే రాత్రీపగలూ తేడా లేకుంట పనిచేస్తం. ప్రతి రోజూ 20 నుంచి 30 కిలో మీటర్లు తిరగాల్సి వస్తుంది. ఐదు నెలలుగా జీతాలు రావడం లేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సర్కారు మా గోస తీర్చాలి.
– చాపిడి బాలేశ్, వాల్ ఆపరేటర్, ఆసిఫాబాద్
ప్రభుత్వం స్పందించాలి..
కుమ్రం భీం ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ నీరు సరఫరా అయ్యే గ్రామాల పరిధిలో దాదాపు 600 మంది సిబ్బంది పనిచేస్తున్నాం. అసలే తక్కువ వేతనం. అదీ కూడా సమయానికి అందించకుంటే ఎలా..? తీవ్ర ఇబ్బందులు పడుతున్నం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, జీతాలు త్వరగా చెల్లించాలి.
– మాచరాల బుద్ధయ్య, ఆపరేటర్, కెరమెరి