బాసర, మే 17 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, రాష్ట్ర ఐటీ శాఖ మాత్యులు కేటీఆర్ తనయుడు హిమాన్షు తన స్నేహితులతో కలిసి బుధవారం బాసరలో సందడి చేశారు. నిర్మల్ జిల్లా బాసర గోదావరి వద్దకు చేరుకోగానే హిమాన్షుకు ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ర్యాలీగా బాసర ఆలయానికి చేరుకొగా.. ఆలయ అర్చకులు హిమాన్షుకు స్వాగతం పలికారు. అనంతరం కుంకుమార్చన పూజ నిర్వహించారు. ఆలయ గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించగా.. ఆలయ అర్చకులు శాలువతో సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.
సెల్ఫీలు దిగుతూ సరదాగా..
హిమాన్షుతో ఫొటోలు దిగడానికి భక్తులు, కార్యకర్తలు ఎగబడ్డారు. ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తూ సరదాగా సందడి చేస్తూ సెల్ఫీలు దిగారు. అనంతరం బాసర నుంచి యాదగిరి గుట్టకు బయలుదేరారు. దాదాపు రెండు గంటలకుపైగా బాసరలో హిమాన్షు సందడి చేయడంతో భక్తులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యే విఠల్రెడ్డితోపాటు కిర్గుల్ సర్పంచ్ సుధాకర్రెడ్డి, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు శ్యాం, వైస్ ఎంపీపీ నర్సింగ్రావు, యువనాయకులు కార్తీక్రావు, సంతోష్రావు, జ్ఞానిపటేల్, జిడ్డు మల్లయ్య, మాజీ పీఏసీఎస్ చైర్మన్ నూకం రామరావు ఉన్నారు.