సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో అసౌకర్యాల నడుమ కొనసాగిన ట్రిపుల్ ఐటీ, స్వరాష్ట్రంలో వేగంగా ప్రగతి బాట పట్టింది. ఇటీవల విద్యార్థులు చేపట్టిన ఆందోళనలపై స్పందించిన ప్రభుత్వం, ఏకంగా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, కల్వకుంట్ల తారకరామారావును పంపి చర్చలు జరిపించింది. మూడు గంటల పాటు విద్యాలయంలో కలియదిరిగి సమస్యలు తెలుసుకున్న మంత్రి కేటీఆర్, ఇచ్చిన హామీలన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో నెరవేర్చుతున్నారు. ఈ నేథప్యంలో శనివారం నిర్వహించనున్న స్నాతకోత్సవానికి వారు ముఖ్య అతిథులు హాజరై పిల్లలకు ల్యాప్టాప్లు, యూనిఫాంలు, షూస్లతో పాటు గోల్డ్మెడల్స్, డిగ్రీ పట్టాలు అందించనున్నారు. అదనపు డిజిటల్ తరగతి గదులు, సోలార్ ప్లాంట్, ఐటీసీసీ, సైన్స్ ల్యాబ్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు.
నిర్మల్, డిసెంబర్ 9(నమస్తే తెలంగాణ):బాసర ట్రిపుల్ ఐటీ ప్రగతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటైన ఈ ట్రిపుల్ ఐటీని అప్పటి పాలకులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దీంతో విద్యార్థులు అసౌకర్యాల మధ్య చదువులు కొనసాగించాల్సి వచ్చింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ ట్రిపుల్ ఐటీలో సౌకర్యాలను మెరుగు పర్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ ప్రక్రియలో కొంత ఆలస్యం కావడం.. విద్యార్థులు ఆందోళనలకు దిగడంతో సీఎం కేసీఆర్ వెంటనే స్పందించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు, స్థానిక మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, సాంకేతిక విద్యా శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులను ట్రిపుల్ ఐటీకి పంపారు. వీరంతా విద్యార్థులతో చర్చలు జరిపారు. వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
మరోసారి ట్రిపుల్ఐటీకి ..
ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ను బాసర ట్రిపుల్ ఐటీకి పంపిం ది. దాదాపు 3 గంటల పాటు ఆయన ట్రిపుల్ ఐటీలోనే గడిపి అక్కడి విద్యార్థులతో మమేకమయ్యారు. వారితో కలిసి లంచ్ చేయడంతో పాటు సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ముఖ్యంగా ల్యాప్టాప్లు, యూనిఫాం, షూస్ అందజేయాలని విద్యార్థులు మంత్రిని కోరారు. నాణ్యమైన భోజనం అందించాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా మరో మెస్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. డిజిటల్ ల్యాబ్, డాటా సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రికి వివరించారు. ఇక్కడి ట్రిపుల్ ఐటీలో పరిపాలనా పరమైన సమస్యతో పాటు అకడమిక్ పరంగా తలెత్తుతున్న సమస్యల పరిష్కారం కోసం హెచ్వోడీ, డీన్లను కూడామార్చే విషయాన్ని విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
24గంటల పాటు అందుబాటులో ఉండేలా లైబ్రరీ సదుపాయం, అదనపు తరగతి గదులతో పాటు, క్రీడల నిర్వహణకు పీడీలను నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలన్నింటినీ తెలుసుకున్న మంత్రి కేటీఆర్ వాటి పరిష్కారం కోసం కసరత్తు చేశారు. హైదరాబాద్ నుంచే ఒక్కో సమస్య పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేయడంతో పాటు వాటి అమలు చేయించారు. ఇలా ప్రధాన సమస్యలన్నీ పరిష్కారమైన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మరోసారి ట్రిపుల్ ఐటీ క్యాంపస్ను సందర్శిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. శనివారం నిర్వహించనున్న ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవ్వడమే కాకుండా మరోసారి ఇక్కడి విద్యార్థులతో మమేకం కానున్నారు.
మాట ఇచ్చి.. హామీ నిలబెట్టి…
ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సంలో మంత్రి కేటీఆర్ విద్యార్థులకు ల్యాప్టాప్లు, యూనిఫాం, షూస్ అందజేయనున్నారు. 24 అదనపు డిజిటల్ తరగతి గదులు, ప్రత్యేకంగా నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్లో ఐటీసీసీ ల్యాబ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సెంటర్) తోపాటు సైన్స్ ల్యాబ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే ప్రత్యేకంగా విద్యార్థినులకు క్రీడా శిక్షణ కోసం ముగ్గురు పీడీలను నియమించారు. మెస్లలో నాణ్యమైన భోజనం తయారు చేయించేందుకు అవసరమైన సిబ్బందిని పెంచడంతో పాటు, పర్యవేక్షణ కోసం అదనంగా వార్డెన్లను రిక్రూట్ చేశారు. వసతి గృహాల్లో కూడా వార్డెన్ల సంఖ్య పెంచారు. విద్యార్థినుల వసతి గృహాలపై సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి వేడి నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఇటీవలి పర్యటనలో మంత్రి చేసిన సూచన మేరకు ఆడిటోరియంలో అదనంగా కొత్త కుర్చీలు ఏర్పాటు చేశారు. పరిపాలన, అకడమిక్ పరంగా తరచూ తలెత్తుతున్న సమస్యల పరిష్కారం కోసం ట్రిపుల్ ఐటీలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న హెచ్వోడీలు, డీన్లను మార్చేశారు. 24 గంటల పాటు లైబ్రరీని అందుబాటులో ఉంచుతున్నారు. ఎకో పార్క్ ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. ప్రధానంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్న ఉద్దేశంతో కొత్తగా క్యాటరింగ్ ఏజెన్సీలను నియమించేందుకు అవసరమైన టెండరు ప్రక్రియ సాగుతున్నది. విద్యార్థినుల భద్రత కోసం ప్రత్యేకంగా మహిళా ఎస్స్ని నియమించారు. ఇలా హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతుండడం, మంత్రి కేటీఆర్ ట్రిపుల్ ఐటీకి రానుండడంతో విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
హాజరు కానున్న మంత్రులు..
బాసర, డిసెంబర్ 9 : బాసర ట్రిపుల్ఐటీలో ఐదో స్నాతకోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వ హించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి, అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డితో పాటు ఎస్వీపీ అండ్ గ్లోబల్ హెడ్, టెక్నాలజీ బిజినెస్ మీట్ వీ రాజన్న హాజరు కాను న్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక హెలి కాప్టర్ ద్వారా బాసరకు చేరుకుంటారు. ముందు గా కాన్ఫరెన్స్ హాల్లో విద్యార్థులకు ల్యాప్ టాప్లు, యూనిఫాంలు, షూస్ అందించను న్నారు. అనంతరం ఐటీసీసీ(ఇన్ఫర్మెషన్ టెక్నాల జీ కంప్యూటర్ సైన్స్), సైన్స్ ల్యాబ్, డిజిటల్ తరగతి గదులతో పాటు సోలార్ప్లాంట్ నిర్మాణా నికి ఆన్లైన్లో శంకుస్థాపన చేస్తారు. ఉదయం 10గంటలకు స్టూడెంట్ యాక్టివిఈ సెంటర్ భవనంలో నిర్వహించనున్న స్నాతకోత్సవానికి నాలుగేళ్లుగా ఉత్తమ ప్రతిభ చూపిన 38 మంది విద్యార్థులకు బంగారు పతకా లు, 576 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేయనున్నారు. కార్యక్రమంలో మంత్రుల తో పాటు ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ఇన్చార్జి వైస్ చాన్స్లర్ వెంకటరమణ డైరెక్టర్ సతీశ్ కుమార్, సీవోఈ వినోద్, డీన్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్రిపుల్ఐటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొననున్నారు.
డ్రెస్కోడ్
స్నాతకోత్సవంలో పాల్గొననున్న విద్యార్థులకు ప్రత్యేకంగా డ్రెస్కోడ్ను యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు. విద్యార్థినులు వైట్ కలర్ చుడీదార్తో పాటు ఆకుపచ్చని చున్నీ, విద్యార్థులు వైట్ కలర్ ఫైజామాతో ఆకుపచ్చ కండువా ఉండే విధంగా రూపొందించారు.