ఆసిఫాబాద్, ఫిబ్రవరి 11 : జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న ఆసిఫాబాద్ను ప్రభుత్వం మున్సిపాలిటీగా ప్రకటించింది. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని తెలుపగా, ప్రాధాన్యం సంతరించు కున్నది. ఏజెన్సీ ప్రాంతమైన రాజంపేటను ప్రత్యేక జీపీగా మార్చి, జన్కాపూర్, గొడవల్లి రెవెన్యూ విలేజ్లను కలిపి బల్దియాను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీ నుంచి అమల్లోకి రానుండగా, పట్టణ రూపురేఖలు మారిపోయే అవకాశమున్నది. సర్కారు చొరవతో దశాబ్దాల కల నెరవేరుతుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ను జిల్లాగా ఏర్పాటు చేసినప్పటికీ మేజర్ గ్రామపంచాయతీగానే కొనసాగుతున్నది. గతంలో ఆసిఫాబాద్ను ప్రభుత్వం మున్సిపాలిటీగా ప్రకటించినప్పటికీ 1/70 చట్టం పరిధిలో ఉండడం పాలనాపరమైన ఇబ్బందులతో గవర్నర్ అనుమతి అనుమతులు ఇవ్వకపోవడంతో మున్సిపాలిటీగా ప్రకటించి మూడున్న రేండ్లు పూర్తయినప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. తాజాగా ప్రభుత్వం 1/70 చట్టం అమల్లో ఉన్న ఇటీవల రాజంపేటను గ్రామ పంచాయతీగా మార్చేందుకు సంబంధించిన జీవోను విడుదల చే సింది. ఏజెన్సీ ప్రాంతం అయిన రాజంపేటను ప్ర త్యేక పంచాయతీగా ఏర్పాటు చేస్తూ జన్కాపూర్, గొడవల్లి రెవెన్యూ విలేజ్లతో మున్సిపాలిటీగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఈ మేరకు శుక్రవారం జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆసిఫాబాద్ను మున్సిపాల్టీగా ప్రకటించడం తో పాటు వచ్చే ఏడాది 4 ఫిబ్రవరి 2024 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.
ఆసిఫాబాద్ చరిత్ర..
1913 నుంచి 1940 వరకు జిల్లాకేంద్రంగా కొనసాగిన ఆసిఫాబాద్ను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జిల్లాకేంద్రాన్ని ఆదిలాబాద్కు తరలించి తాలుకాగా ఏర్పాటు చేసింది.అనంతరం డివిజన్గా ఏర్పాటు చేసి పాలన కొనసాగించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జిల్లాల పునర్విభజనలో భాగంగా సీఎం కేసీఆర్ రెండోసారి కుమ్రం భీం జిల్లా పేరుతో ఆసిఫాబాద్ను జిల్లాకేంద్రంగా ఏర్పాటు చేశారు. నిజాం కాలంలో జిల్లాకేంద్రంగా వెలుగొందిన ఆసిఫాబాద్ 1940 లో జిల్లా కేంద్రం ఆదిలాబాద్కు తరలిపోయింది. అయితే 1961 వరకు పురపాలక కేంద్రంగా కొనసాగింది. ఆ తర్వాత కాగజ్నగర్ను మున్సిపాల్టీగా మార్చడంతో ఆసిఫాబాద్ పట్టణాన్ని మేజర్ గ్రామ పంచాయతీగా మార్చారు. ప్రభుత్వం 2019 ఆగస్టు 2న నూతన మున్సిపాలిటీగా ఆసిఫాబాద్ను ప్రకటించడంతో 56 సంవత్సరాల తర్వాత బల్దియాగా రూపుదిద్దుకునే అవకాశం పొందింది. అయితే కొన్ని పాలనాపరమైన సమస్యలు రావడంతో ఏర్పాటు ఆలస్యం అయినప్పటికీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని మున్సిపాల్టీగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది.
నెరవేరనున్న ఆశలు..
2019లో ప్రభుత్వం మున్సిపాల్టీగా ప్రకటించిన తర్వాత జిల్లాకేంద్రంలో సంబురాలు నిర్వహించారు. అయితే అవి బోర్డు వరకు మాత్రమే పరిమితమయ్యాయి. తాజాగా ప్రభుత్వం రాజంపేటను ఆసిఫాబాద్ నుంచి తొలగిస్తూ ప్రత్యేక గ్రా మపంచాయతీ ఏర్పాటు కోసం జీవో నెంబర్ 42 విడుదల చేసింది. దీంతో పాటు బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక తీర్మానం చేసి గెజిట్ విడుదల చేశా రు. దీంతో ప్రజల ఆశలు నెరవేరనున్నాయి.
పట్టణ రూపురేఖల్లో మార్పు..
ప్రస్తుతం ఆసిఫాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ రాజంపేట, జన్కాపూర్, వైఎస్ఆర్ నగర్, ఆర్ఆర్ కాలనీ వరకు విస్తరించి ఉంది. రాజంపేట పంచాయతీగా ఆవిర్భవిస్తే ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి విస్తరించిన ప్రాంతం తో పాటు జూబ్లీ మారెట్, టీఆర్నగర్, పొట్టి శ్రీ రాములు వరకు ప్రధాన రహదారితో పాటు రా జంపేట ప్రాంతంలోకి రానుంది.