నిర్మల్: నిర్మల్లోని దేవరకోట (Devarakota) శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) శంకుస్థాపన చేశారు. ఆలయంలో రూ.50 లక్షల వ్యయంతో సాలహారం, గ్రానైట్ నిర్మాణ పనులను చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేవరకోట క్షేత్రం చాలా పురాతనమైనదని చెప్పారు. ఆలయంలో కల్యాణ మండపానికి రూ.20 లక్షలు, షెడ్డు, కాలక్షేప మండపం, దుకాణల నిర్మాణాలకు రూ.50 లక్షలు విడుదల చేశామని,
ఇప్పటి వరకు ఆలయానికి రూ.కోటి 20 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
నిర్మల్ పట్టణంలోనే రూ.32.13 కోట్లతో 162 ఆలయాలను పూర్తిగా దేవాదాయ శాఖ నిధులతో నిర్మించామని చెప్పారు. 80 శాతం వరకు ఆలయాల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. అడెల్లి ఆలయాన్ని రూ.15 కోట్లతో కృష్ణ శిలలతో నిర్మిస్తున్నామని, ఈ విజయదశమికి ఆలయం ప్రారంభంకానుందని తెలిపారు. అంతకుముందు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.