నిర్మల్ జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నేటి(శుక్రవారం) నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానుండగా.. లోకేశ్వరం మండలంలోని రాజురాలో మొదటి కేంద్రాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించనున్నారు. 1,00,846 ఎకరాల్లో వరి సాగవగా.. 1.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం 204 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్కెటింగ్ శాఖ అధికారులు 130 ప్యాడీ క్లీనర్లు అందించగా.. అదనంగా 95 అందుబాటులో ఉంచారు. 42.50 లక్షల గన్నీ బ్యాగులు అవసరమవుతాయని అధికారులు గుర్తించగా.. ప్రస్తుతం 28.32 లక్షల సంచులు సిద్ధంగా ఉన్నాయి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు కస్టమ్ మిల్లింగ్ కోసం తరలించడానికి ఏర్పాట్లు చేశారు. కాగా.. ధాన్యం వివరాలను ఆన్లైన్లో పొందుపర్చి.. సకాలంలో డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
నిర్మల్, ఏప్రిల్ 20(నమస్తే తెలంగాణ) : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. గత యాసంగిలో వడ్లను కొనబోమని కేంద్రం కొర్రీలు పెట్టినా.. అన్నదాతను తామే ఆదుకుంటామని చెప్పి చివరి గింజ వరకు కొనుగోలు చేసింది. కనీస మద్దతు ధరతో తీసుకొని వారికి అండగా నిలిచింది. ఈ యేడాది కూడా కొనుగోళ్లకు సర్వం సిద్ధం చేసింది. జిల్లాలో శుక్రవారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి లాంఛనంగా ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముథోల్ నియోజకవర్గం లోకేశ్వరం మండలంలో వరికోతలు ప్రారంభమైన నేపథ్యంలో రాజురా గ్రామంలో మొట్టమొదటి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాన్ని శుక్రవారం మంత్రి ప్రారంభిస్తారు.
అన్నదాతకు అండగా..
రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచీ అన్నదాతకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ కొండంత భరోసానిస్తున్నది. రైతుబంధు, రైతుబీమా, 24 గం టల ఉచిత కరెంట్ లాంటి పథకాలను పొం దుతూ రైతులు ఎంతో సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించకున్నా.. ఆర్థికంగా భారమైనప్పటికీ రా ష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నది. ఈ యాసంగిలో కూడా రైతులు పండించిన ప్రతి గింజనూ కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించిన నేపథ్యంలో స్థానిక అధికారులు కొనుగోళ్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్న లోకేశ్వరం, దిలావర్పూర్, నర్సాపూ ర్ (జీ), లక్ష్మణచాంద, మామడ, నిర్మల్ రూరల్, సోన్, ఖానాపూర్ తదితర మండలాల్లో కొన్ని చోట్ల ఇప్పటికే వరి కోతలు ప్రారంభమయ్యాయి. ధాన్యం దిగుబడులను బట్టి ఆయా మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ఈ యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లా వ్యాప్తంగా 204 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. యాసంగిలో జిల్లా వ్యాప్తంగా రైతులు 1,00,846 ఎకరాల్లో వరి పంట సాగుచేయగా, ఎకరానికి సగటున 18 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఈ విధంగా మొత్తం లక్షా 80 వేల మెట్రి క్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసా య, పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. ఇందులో స్థానిక అవసరాలు, సీడ్ కోసం 10 వేల మెట్రిక్ టన్నులు పోగా, మిగతా లక్షా 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించనున్నారు.
జిల్లా వ్యాప్తంగా 204 కేంద్రాలు..
నిర్మల్ జిల్లాలో మొత్తం 204 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో 44 కేంద్రాలు, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 100, డీసీఎమ్మెస్ ఆధ్వర్యంలో 55, జీసీసీ ఆధ్వర్యంలో 5 కేంద్రాలు ఉన్నాయి. కాగా మార్కెటింగ్ శాఖ అధికారులు ఇప్పటికే కొనుగోలు కేంద్రాల ఏజెన్సీలకు 130 ప్యాడీ క్లీనర్లను అందజేశారు. అదనంగా మరో 95 అందుబాటులో ఉంచారు. రెండు సీజన్లలో 2500 టార్పాలిన్లను రైతులకు పంపిణీ చేశారు. ఇంకా మార్కెట్ కమిటీల్లో 2500 వరకు అందుబాటులో ఉన్నాయి. అలాగే 304 ఎలక్ట్రానిక్ కాంటాలను ఇప్పటికే అందజేశారు. ఇంకా 125 కాంటాలు అదనంగా ఉంచారు. తేమ శాతాన్ని గుర్తించేందుకు 250 మీటర్లను పంపిణీ చేశామని, అలాగే 40 మీటర్లు అదనంగా అందుబాటులో ఉంచామని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు.
గన్నీ బ్యాగులు సిద్ధం..
యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం 42లక్షల 50 వేల గన్నీ బ్యాగులు అవసరమవుతాయని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం జిల్లాలో 28 లక్షల 32 వేల సంచులు సిద్ధంగా ఉన్నాయి. మిగతా గన్నీ బ్యాగులను వివిధ రూపాల్లో సేకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు మిల్లర్ల నుంచి తెప్పించుకున్న పౌరసరఫరాల శాఖ అధికారులు, రేషన్ షాపుల్లోని బ్యాగులను సేకరించే పనిలో పడ్డారు. రేషన్ దుకాణాల్లోని ఒక్కో సంచికి రూ.21 వెచ్చించనున్నారు. కాగా, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. గత వానకాలం సీజన్ నుంచి ప్రభుత్వం మద్దతు ధరను రూ.100 పెంచిన సంగతి తెలిసిందే. గ్రేడ్-ఏ రకం క్వింటాలుకు రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040 మద్దతు ధర అందిస్తున్నది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చడం ద్వారా ధాన్యం విక్రయించిన రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం..
జిల్లాలో కొనుగోళ్ల కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. జిల్లా వ్యాప్తంగా లక్షా 70వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఆయా శాఖల ద్వారా మొత్తం 204 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. సరిపడా గన్నీ సంచులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు వసతులు కల్పిస్తాం. నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలి. దళారులను నమ్మి మోసపోవద్దు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు 24గంటల్లోగా వారి ఖాతాలో డబ్బు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. కేంద్రాల నుంచి ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేశాం. – రాంబాబు, అదనపు కలెక్టర్, నిర్మల్