ఏడు పదుల వయసులోనూ అలుపెరుగని బాటసారి. నిర్మల్ నుంచి కదిలి మహా పాపహరేశ్వర ఆలయం వరకు దాదాపు 25 కిలోమీటర్లు ఏకధాటిగా నడిచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన మంత్రి అల్లోల. పాదయాత్రలో భాగంగా ఆయనకు వాడవాడలా, ఊరూరా పూలమాలలు వేస్తూ ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. పురవీధులు ఆధ్యాత్మిక, భక్తి పాటలతో మారుమోగగా.. భక్తులు సాయి, శివ నామ స్మరణతో పులకించి పోయారు. మంత్రికి కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సహా ప్రముఖులు స్వాగతం పలుకగా.. మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని.. రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
నిర్మల్ అర్బన్, ఆగస్టు 24 : నిర్మల్ పట్టణంలోని గండిరామన్న దత్తసాయి క్షేత్రం నుంచి కదిలి మహా పాపహరేశ్వర ఆలయం వరకు బుధవారం సాయిదీక్ష సేవా సమితి అధ్యక్షుడు లక్కాడి జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఆరో సారి నిర్వహించిన మహా పాదయాత్రను రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు సాయిబాబా ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి అశేష భక్తజన బృందంతో కలిసి మహా పాదయాత్ర పూర్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ లోక కల్యాణం కోసం గత ఆరేండ్లుగా శ్రావణ మాసంలో లక్కాడి జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తున్న మహత్కార్యంలో ఈసారి పాల్పంచుకోవడం భగవత్ కృపగా భావిస్తున్నానని అన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆ దేవుడి ఆశీస్సులతో పాటు రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో పెద్ద ఎత్తున ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని నిర్మల్ నియోజకవర్గంతో పాటు జిల్లాలో వేలాది ఆలయాలకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. నిరాదరణకు గురైన వందలాది ఆలయాలు నేడు ధూపదీప నైవేద్యాలతో నిత్యం వెలుగొందుతున్నాయని పేర్కొన్నారు. యువత, భక్తి భావం పెంపొందించుకోవాలని, సన్మార్గంలో నడువాలని సూచించారు.
74 ఏండ్ల వయస్సులో..
25 కిలోమీటర్లు కొనసాగిన పాదయాత్రలో మంత్రి అల్లోల చురుకుగా పాల్గొన్నారు. 74ఏండ్ల వయస్సులోనూ ఏకధాటిగా నడిచి యువతను ఆశ్చర్యపరిచారు. పాదయాత్రలో జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, సాయిదీక్షా సేవా సమితి అధ్యక్షుడు లక్కాడి జగన్మోహన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మారుగొండ రాము, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, పాకాల ఫౌండేషన్ చైర్మన్ పాకాల రాంచందర్, కొరిపెల్లి దేవేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శేఖర్, కిషన్ పాల్గొన్నారు.
కదిలి ఆలయాభివృద్ధికి కృషి
దిలావర్పూర్, ఆగస్టు 24 : కదిలి ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి అల్లోల తెలిపారు. 10 ఎకరాల భూమి కేటాయించి పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. పాదయాత్ర ఆద్యంతం ఆధ్యాత్మిక కీర్తనలు, సాయి, శివనామస్మరణ మార్మోగింది. పాదయాత్రకు ఊరూరా భక్తులు, పలువురు నాయకులు ఘన స్వాగతం పలికి మంత్రిని సత్కరించారు.