రోడ్లు ఊడ్చి.. మొక్కలు నాటి..
ఉద్యమంలా ఐదో రోజూ పల్లె, పట్టణ ప్రగతి
పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు
స్వచ్ఛ సంకల్పం నెరవేరుతున్నది. పల్లె, పట్టణ ప్రగతి ఉద్యమంలా సాగుతుండడంతో చెత్తాచెదారం కంటికి కనిపించడం లేదు. రహదారులు అద్దాల్లా మెరుస్తు న్నాయి. డ్రైనేజీలు శుభ్రం చేస్తుండడంతో దుర్వాసన రావడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి పలు సూచనలు చేస్తున్నారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నారు. మంగళవారం నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలోని విజయనగర్, ఆస్రనగర్ కాలనీల్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పర్యటించారు. ఉట్నూర్ మండలం అంధోలిలో ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్.. బేల మండలం చాంద్పల్లి, జునోథ్ గ్రామాల్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్.. సారంగాపూర్ మండలం తాండ్రా(జీ), కంకేటా.. లోకేశ్వరం మండలం హవార్గా గ్రామాల్లో నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పర్యటించారు.
ఐదో రోజైన మంగళవారం ఆసిఫాబాద్లోని కసాబ్వాడిలో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. వడ్డెపల్లి గార్డెన్లో పల్లె ప్రగతిపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ రాహుల్రాజ్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అదనపు కలెక్టర్ వరుణ్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. కన్నెపల్లి, భీమిని మండలాల్లో మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు.
ఆసిఫాబాద్ : పల్లెప్రగతి సమన్వయ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆత్రం సక్కు
ఖానాపూర్ టౌన్ : విద్యానగర్లో మురుగు కాలువలు శుభ్రం చేయిస్తున్న మున్సిపల్ చైర్మన్ రాజేందర్
ఆదిలాబాద్/ మంచిర్యాల /ఆసిఫాబాద్, జూన్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించడంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఐదు రోజూ కొనసాగాయి. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టణ, పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలోని విజయనగర్, ఆస్రానగర్ కాలనీల్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పర్యటించారు.
స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్థానికులు కూడా తమ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఉట్నూర్ మండలం అంధోలి గ్రామంలో ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పాల్గొన్నారు. బేల మండలం చాంద్పల్లి, జునోథ్ గ్రామాల్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యటించి మొక్కలు నాటారు. ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ రణదీవనగర్, గాంధీనగర్ కాలనీల్లో పర్యటించారు. సారంగాపూర్ మండలం తాండ్రా(జీ), కంకేటా.. లోకేశ్వరం మండలం హవార్గా గ్రామాల్లో నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పర్యటించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు కూడా అధిక సంఖ్యలో భాగస్వాములయ్యారు.
ఆదిలాబాద్ రూరల్ : మొక్కలు నాటుతున్న మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, అదనపు కలెక్టర్