నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 12 : అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో ముస్లింలకు రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లను బుధవారం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదలు పండుగలను నిర్వహించుకునేందుకు కానుకలను అందజేస్తున్నదని గుర్తు చేశారు.
జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు మొత్తం ఆరు వేల గిఫ్ట్ ప్యాకెట్లు వచ్చాయని, ఇందులో నిర్మల్కు 2వేలు, ముథోల్కు 2500, ఖానాపూర్కు 1500 చొప్పున వచ్చినట్లు తెలిపారు. గిఫ్ట్లతో పాటు ఇఫ్తార్కు రూ.లక్ష అందించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్ రెడ్డి, అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్లు వేణు, నల్లూరి పోశెట్టి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్, మైనార్టీ పట్టణాధ్యక్షుడు సయ్యద్ ముషీరొద్దీన్, నాయకులు నజీర్ తదితరులు పాల్గొన్నారు.
ఈద్గా పనులను పరిశీలించిన మంత్రి
నిర్మల్ పట్టణ శివారులోని చించోలి వద్ద ఎనిమిదెకరాల స్థలంలో నిర్మిస్తున్న నూతన ఈద్గా పనులను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. ముస్లింలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని విశాల స్థలంలో ఈద్గా నిర్మిస్తామని హామీ ఇచ్చామని, ఆ మేరకు అన్ని హంగులతో నిర్మిస్తున్నామన్నారు. రంజాన్ పండుగకు ఇక్కడే ప్రార్థనలు చేయనున్నారని తెలిపారు. మంత్రి వెంట కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మైనార్టీ నాయకులు తదితరులున్నారు. కాగా, నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్లో రాత్రి నిర్వహించిన ఇఫ్తార్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన ఆర్యవైశ్య సంఘం సభ్యులు
నిర్మల్ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం సభ్యులు మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య సంఘ భవనాన్ని నిర్మించాలని వినతి పత్రం అందజేశారు. స్పందించిన మంత్రి కమ్యూనిటీ హాల్ను ప్రభుత్వం తరఫున నిర్మిస్తామని హామి ఇచ్చారు. అనంతరం మంత్రిని సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు ఆమెడ కిషన్, లింగపల్లి లక్ష్మీనారాయణ, ఆమెడ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.