సమాజ శ్రేయస్సు, బంజారాల అభ్యున్నతి కోసం సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జగదాంబ దేవి ఆలయం వద్ద శుక్రవారం సేవాలాల్ 284వ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐడీసీ చైర్మన్ వేణుగోపాలాచారి, ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖానాయక్, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ వరుణ్రెడ్డితో కలిసి మంత్రి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వరాష్ట్రంలోనే గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో ఎన్నో పథకాలు అమలవుతున్నాయని, త్వరలోనే పోడు పట్టాలను అందించి తీరుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యా ర్థులు, కళాకారులతో కలిసి, మంత్రి, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు నృత్యం చేశారు.
నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 24: సమాజ శ్రేయస్సే సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జగదాంబదేవి ఆలయం వద్ద సంత్ సేవాలాల్ 284వ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఐడీసీ చైర్మన్ వేణుగోపాలాచారి, మాజీ మంత్రి అమర్సింగ్ తిలావత్, ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రేఖానాయక్, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ వరుణ్రెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. మొదట జగదాంబదేవి కొత్త ఆలయంలో గిరిజనుల ఆరాధ్యదైవం లింగ్రం మహారాజ్తో కలిసి జ్యోతిని వెలిగించి పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గిరిజనుల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని గుర్తు చేశారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్, తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించడం, అటవీ భూములు సాగు చేసుకుంటున్న వారికి త్వరలో పోడు పట్టాలను అందిస్తామని తెలిపారు. గిరిజనుల ఆత్మగౌరవం పెరిగేలా ఆత్మగౌరవ భవనాలను హైదరాబాద్లో నిర్మించినట్లు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తండాల్లో సమస్యలు రాజ్యమేలుతుంటే,స్వరాష్ట్రమైన తెలంగాణలో తండాలకు రాజ్యాధికారం వచ్చిందని గుర్తు చేశారు. సేవాలాల్ మహారాజ్ జయంత్యుత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు సీఎం తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పదని తెలిపారు.
జగదాంబదేవి ఆలయానికి రూ. లక్ష విరాళం అందిస్తున్న నరేందర్ రాథోడ్
మరో రూ. కోటి మంజూరు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని జగదాంబదేవి ఆలయానికి ప్రభుత్వం సుమారు రూ. 2.50 కోట్లను మంజూరు చేసిందని, మరో రూ. కోటి మంజూరు చేసి పనులు పూర్తి చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. దీంతో బంజారా సోదరులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు. బోథ్లో కైలాస్ టేకిడి ఆలయాభివృద్ధికి రూ. 50లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. గిరిజన విద్యార్థులతో కలిసి నృత్యాలు చేశారు. ప్రముఖ కళాకారుడు మోహన్నాయక్ పాడిన పాటలు ఉర్రూతలూగించాయి. భైంసాకు చెందిన నరేందర్రాథోడ్ జగదాంబ మందిరానికి రూ. లక్ష విరాళాన్ని మంత్రికి అందించారు. జడ్పీ సీఈవో సుధీర్కుమార్, డీఆర్డీవో విజయలక్ష్మి ఆధ్వర్యంలో జగదాంబ ఆలయం వద్ద నిర్వహించిన వేడుకలకు పెద్ద ఎత్తున బంజారా సోదరులు సంప్రదాయ దుస్తులు ధరించి తరలివచ్చారు. మొదట ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఆలయం వరకు ర్యాలీ తీశారు. ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్రెడ్డి అన్నదానం ఏర్పా టు చేశారు. జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, బంజారా సంఘ నాయకులు శ్యాం నాయక్, రాజేశ్నాయక్, జానాబాయి, ఆకాతాయి, తుకారాంనాయక్, బలి రాం నాయక్, గోవింద్ నాయక్, వెంకట్రాం నాయక్, సంతోష్ నాయక్, రాజేందర్ నాయక్, నరేందర్ రాథోడ్, డీఎస్పీ జీవన్రెడ్డి, నాయకులు అయిర నారాయణరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, తదితరులున్నారు.
స్వరాష్ట్రంలోనే తండాలకు గుర్తింపు
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే తండాలకు గుర్తింపు వచ్చింది. 500 జనాభా ఉన్న ప్రతి తండాను ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మార్చుకున్నాం. దీంతో తండాల్లో గిరిజనులు మాత్రమే పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వానికి గిరిజనులందరూ రుణపడి ఉంటారు.
– రేఖానాయక్, ఖానాపూర్ ఎమ్మెల్యే
గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషి.
జిల్లాలో గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. నిర్మల్ జిల్లాలో గిరిజన గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నీరు అందిస్తున్నాం. ప్రతి గ్రామానికీ రోడ్డు సౌకర్యం, విద్యుత్ కల్పించాం. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ఇప్పటికే తీర్మానం చేయించారు.
– విఠల్రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే
అర్హులైన రైతులందరికీ పోడు పట్టాలు..
పోడు భూములు సాగుచేసుకుంటున్న రైతులను గుర్తించి పోడు పట్టాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఐటీడీఏ ద్వారా ఇప్పటికే అన్ని జిల్లాలో అర్హుల జాబితాను సర్వే చేసి గుర్తించాం. గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో నిధులను ఖర్చు చేస్తున్నది. గిరిజనులు బాగా చదువుకొని మంచి స్థానంలో నిలబడాలి. – వరుణ్రెడ్డి, నిర్మల్ కలెక్టర్
8వ షెడ్యూల్లో భాషను చేర్చాలి..
దేశంలో 13 కోట్ల మంది ప్రజలు బంజారా భాషను మాట్లాడుతు న్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ భాషను 8వ షెడ్యూల్లో చేర్చి గుర్తింపునివ్వాలి. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ కల్పించి అసెంబ్లీలో తీర్మానం చేసినందునా, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి దాన్ని సాధించుకుందాం.
– అమర్సింగ్ తిలావత్, ఆలిండియా బంజారా సంఘం అధ్యక్షుడు, మాజీ మంత్రి